Chandra Babu interesting comments on Andhra Pradesh CM Jagan in Telugu Desham party Mahanadu

                క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు


 

తెలుగు దేశం పార్టీ మహానాడులో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్తూనే.. రాబోయే రోజుల్లో టీడీపీ (TDP) అధికార పగ్గాలు చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ క్రమంలో చంద్రబాబు.. నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు వైఎస్సార్ సీపీపై విమర్శలు గుప్పించారు. అంతే కాదు క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కొత్త నినాదాన్ని చంద్రబాబు మహానాడులో వినిపించారు. దీంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. ఈ కొత్త నినాదంతో 2024 ఎన్నికలకు చంద్రబాబు సమర శంఖం పూరించారని చెప్పవచ్చు. 

 వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని చంద్రబాబు చెప్పారు.  ప్రజా సంక్షేమాన్ని సీఎం జగన్ గాలికొదిలేశారని విమర్శించారు. అలాగే కరెంటు బిల్లులు, నీటి బిల్లులు, డ్రైనేజీ పన్ను అంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా వసూళ్లు చేస్తున్నారన్నారు. చివరకు చెత్తపై పన్ను వేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్ రెడ్డి ఒక్కరేనని విమర్శించారు. ఒక్క ఛాన్స్  అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజలపై 'బాదుడే బాదుడు' అమలు చేస్తోందని విమర్శించారు చంద్రబాబు. టీడీపీ హాయాంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే.. మిగతా 28 శాతాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన జగన్.. అదే కేంద్ర ప్రభుత్వం దగ్గర మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు చంద్రబాబు. 

 గతంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలతోనే మళ్లీ దావోస్ లో ఎంఓయూలు చేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ చేతగాని పాలనకు ఇదే నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతు సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఫలితంగా దిక్కుతోచక రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపురించిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే రైతులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు సమస్యలపై పోరాటంలో తెలుగు దేశం పార్టీ కూడా రోడ్లపైకి వస్తుందని తెలిపారు. రైతులు ఎవరూ మోటార్లు బిగించుకోవద్దని సూచించారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. 

 తెలంగాణలోని  హైదరాబాద్ లో 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 20 ఏళ్ల ముందు చూపుతో ఏర్పాటు చేసిన ISB.. ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తోందని చెప్పారు. ISB ఏర్పాటు చేయడం తనకు ఆత్మ సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చారు.  

Also Read: బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ తప్పనిసరి



Post a Comment

Previous Post Next Post