బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ తప్పనిసరి
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ తెలిపింది కేంద్రం. జూన్ 1 2022 నుంచి ఎలాంటి పసిడి ఆభరణాలు విక్రయించినా హాల్ మార్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్ తర్వాత బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారు స్వచ్ఛత లేదా ప్యూరిటీ విషయంలో పూర్తి నమ్మకంగా ఉండవచ్చు. అంతేకాదు బంగారం విలువకు సమానమైన మొత్తాన్ని చెల్లించే అవకాశం లభిస్తుంది. జూన్ 1 తర్వాత నుంచి గోల్డ్ హాల్ మార్కింగ్ అన్ని కేటగిరీలకు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. కాబట్టి జూన్ 1 నుంచి జ్యువెలరీ వ్యాపారులు హాల్ మార్కింగ్ లేని ఆభరణాలు విక్రయించడం కుదరదు.
పసిడి ఆభరణాలకు హాల్ మార్కింగ్ చేయడం వల్ల వినియోగదారులలో విశ్వాసం పెరుగుతుంది. తాము కొన్న వాటికి అదే స్వచ్ఛతతో బంగారం లభిస్తుందనే నమ్మకం లభిస్తుంది. బంగారం చూస్తే.. దాని స్వచ్ఛతను అంచనా వేయడం సామాన్యులకు సాధ్యం కాని విషయం. కాబట్టి.. సామాన్య వినియోగదారులకు స్వచ్ఛత విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మోసాలు జరగడానికి అవకాశం లేకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్ మార్క్ విధానం తీసుకొచ్చింది.
నిజానికి కేంద్ర ప్రభుత్వం 2021 జూన్ 16 నుంచే గోల్డ్ హాల్ మార్కింగ్ను తప్పనిసరి చేసింది. కానీ కేవలం 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారానికి మాత్రమే ఇది వర్తించేది. తర్వాత దీన్ని 6 కేటగిరిలకు వర్తింపజేసింది. 14, 18, 20, 22, 23, 24 క్యారెట్లకు విస్తరించారు. కానీ ఇప్పుడు జూన్ 1 నుంచి అన్ని బంగారు ఆభరణాలకు గోల్డ్ హాల్ మార్కింగ్ తప్పనిసరిగా ఉండాల్సిందేనన్నది కొత్త నిబంధన.