సినిమా వాళ్లు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు?
సినిమా అనేది అనేక రంగుల ప్రపంచం. అక్కడ డబ్బు, పాపులారిటీ సంపాదించే క్రమంలో సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ అలవాటవుతుందని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా, నటులకైతే... ఫిట్నెస్, అందంగా ఉండటం కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటారని పలువురు అభిప్రాయం. బాడీని మైంటైన్ చేయడంతో పాటు వయసు మీద పడకుండా ఉండటానికి కూడా కొన్ని రకాల మాదక ద్రవ్యాలు తీసుకుంటారని అంటుంటారు. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్లో డ్రగ్స్ వినియోగం సర్వసాధారణంగా మారిందనే మాట లేకపోలేదు. తర్వాత, ఇది అలవాటు చేసుకొని.. మెల్లమెల్లగా డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారనే టాక్ ఉంది. ఈ క్రమంలోనే డ్రగ్స్కి బానిసలైన సెలబ్రిటీలను లొంగదీసుకుని... సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి డీలర్స్ దింపుతారని తెలుస్తోంది. ఆ మధ్య, బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్ - మాధవీలత వంటి వారు సినీ ఇండస్ట్రీలో జరిగే పార్టీలలో డ్రగ్స్ కంపల్సరీ అని చేసిన కామెంట్స్ కూడా దీనికి బలం చేకూరుస్తుంది. ...స్పాట్...
ఎవరు మాదక ద్రవ్యాలు తీసుకుంటారో ఎందుకు తీసుకుంటారో ప్రజలందరికీ కూడా తెలియని విషయమేమీ కాదు. మత్తు పదార్థాలు తీసుకునే వారిలో సినిమా వ్యక్తులు మాత్రమే కాదు.. బయట కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారన్నది జగమెరిగిన నిజం. అయితే, బయట వ్యక్తులపై పెట్టే కేసులకు సెలబ్రిటీలపై పెట్టె కేసులకు చాలా తేడా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. అందుకే, ఇండస్ట్రీలో విచ్చలివిడిగా డ్రగ్స్ కల్చర్ పెరిపోతుందనే కామెంట్స్ ఉంది. సినిమా వాళ్లపైన బలం లేని చార్జ్ షీట్లు పెట్టారనీ... ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం తప్పు చేసిందనీ..మాజీ ఎక్సైజ్ కమీషనర్, ఐఏఎస్ చంద్రవదన్ కూడా ఆరోపించారు. పోలీసులు దర్యాప్తులో సినిమా వాళ్లు గ్లామర్ కోసం ఇవి తప్పనిసరై వాడుతున్నామని చెబుతున్నారనీ... శారీరకంగా, మానసికంగా సపోర్ట్ చేయడం కోసం మాదక ద్రవ్యాలు తప్పనిసరి అయ్యాయని అంటారనీ... ఇందులో రాజకీయ నాయకుల పిల్లలు, ధనవంతుల పిల్లలు కూడా ఉంటారనీ... చంద్రవదన్ వెల్లడించారు.
సినిమా వాళ్లను మరింత పాపులర్ చేయడం వల్ల ఉపయోగం లేదన్నది నిపుణులు కూడా చెబుతున్న మాట. అలాగే, ఇన్వెస్టిగేటింగ్ సంస్థలు కూడా సినిమా వాళ్లను చూపించడంలో సరిగ్గా వ్యవహరించడం లేదనీ... వాళ్లను బయటకు చూసిస్తే.. మిగిలిన సెక్టార్లో జనాలు మానుకుంటారని అనుకోని పోలీసులు ఇలా చేసినప్పటికీ... నిజానికి, మూలాల నుండి దీన్ని నిర్మూలించాల్సి ఉందని చంద్రవదన్ పేర్కొన్నారు. ఇక రాజకీయ చిత్తశుద్ధి లేకపోతే... దీన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని అంటున్నారు.
తెలంగాణలో డ్రగ్స్ దందాను సమూలంగా నాశనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపుదిద్దుతామని ప్రకటించారు. డ్రగ్స్ అనే మాటనే రాష్ట్రంలో వినపడద్దన్న రోజు నుంచి డ్రగ్స్ నిర్మూలన కోసం రంగం సిద్ధం చేసారు. డ్రగ్స్ని ఏ రూపంలో తీసుకున్న వెంటనే గుర్తించడానికి నార్కోటిక్ అధికారులకి యూరిన్ కిట్స్ని ప్రభుత్వం అందించింది. మరో వైపు పబ్స్లో ఈవెంట్స్ పేరుతో డ్రగ్స్ని వినియోగిస్తున్న పబ్స్ని అరికట్టడానికి స్వీపర్ డాగ్స్తో పబ్స్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా సెలబ్రెటీస్ డ్రగ్స్ నిర్మూలన మీద వీడియోస్ చేయాలి అంటూ సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. దీనితో, హైద్రాబాద్లో ఈ డ్రగ్స్ మోత తగ్గుతుందని అంతా ఆశిస్తున్నారు.