తిరుమల లడ్డూ చరిత్ర ఏంటో తెలుసా?

                తిరుమల లడ్డూ చరిత్ర ఏంటో తెలుసా?


కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఇచ్చే పుణ్య ప్రసాదం తిరుమల లడ్డూ. ఏళ్లనాటి చరిత్ర ఉన్నా ఈ లడ్డూ రుచి అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందంటే అతిశయోక్తి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తీసుకుంటున్న శ్రద్ధ వల్లే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు ప్రీతిపాత్రమైన లడ్డూ చరిత్రేంటో ఓసారి తెలుసుకుందాం. 

 తిరుమలకు ఎవరు వెళ్లినా లడ్డూ ప్రసాదం తీసుకొచ్చారా అని ఇరుగు పొరుగు వారు అడగడం సాధారణం. అలాగే తిరుమలకు వెళ్తున్నప్పుడు కూడా మాకూ స్వామి వారి ప్రసాదం తీసుకురండి అని భక్తులకు చెప్పడమూ పరిపాటే. తిరుమలకు సందర్శించుకోలేకపోయినా.. శ్రీవారి ప్రసాదం తీసుకున్నా పుణ్యఫలం దక్కుతుందన్నది తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల భక్తులకు నమ్మకం. తిరుమలేషునికి లడ్డూ నైవేద్యం అంటే మహా ప్రీతి. అందుకే స్వామి వారికి ప్రతి రోజూ లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అలాగే భక్తులకు మహా ప్రసాదంగానూ లడ్డూ వితరణ నిత్యం తిరుమలలో జరుగుతూ ఉంటుంది. ఐతే ఈ లడ్డూకు 81 ఏళ్ల చరిత్ర ఉంది. 1940 నాటి నుంచి తిరుమలలో భక్తులకు మహా ప్రసాదంగా లడ్డూను అందిస్తున్నారు. నిజానికి తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాల వితరణ ప్రారంభమైంది. అప్పట్లో సుఖీయం, అప్పం, వడ, అత్తిరసం, మనోహర పడి ప్రసాదాలను అందించేవారు. ఆ తర్వాత 1803లో నాటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో అప్పట్లో బూందీని తీపి ప్రసాదంగా అందించేవారు. కాలక్రమంలో 1940లో తీపి బూందీ ప్రసాదాన్నే లడ్డూగా విక్రయించడం ప్రారంభించారు. 

మూడు రకాల లడ్డూ ప్రసాదం 

ప్రస్తుతం తిరుమలలో మూడు రకాల లడ్డూ ప్రసాద వితరణ జరుగుతోంది. మొదటిది ప్రోక్తం లడ్డు. దీన్ని శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అందరు భక్తులకు ఇస్తారు. 175 గ్రాముల బరువుతో చిన్న సైజులో ఈ లడ్డూ ఉంటుంది. రెండోది ఆస్థానం లడ్డు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ లడ్డూ తయారు చేస్తారు. ఈ లడ్డూ 750 గ్రాముల బరువు ఉంటుంది. ఇక మూడోది కళ్యాణోత్సవం లడ్డు. తక్కువగా తయారు చేసే ఈ లడ్డూల కోసం భక్తులు పోటీ పడతారు. ఐతే కళ్యాణోత్సవం, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే ఈ లడ్డూ అందిస్తున్నారు. మరోవైపు తిరుమల లడ్డూకు 2014లో జియో ఇండికేషన్(GI) ట్యాగ్ లభించింది. 


Read Also: ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?

లడ్డూ పోటు 

తిరుమలలో రోజూ 4 లక్షలకు పైగా లడ్డూల తయారీ జరుగుతుంది. లడ్డూలు తయారు చేసే వంటగదిని లడ్డూ పోటుగా వ్యవహరిస్తారు. ఇక్కడ మొత్తంగా 620 వరకు పోటు కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా టీటీడీ నిర్ణయించిన దిట్టంకు అనుకూలంగా ప్రతి రోజూ లడ్డూ తయారీ చేస్తారు. ఈ దిట్టాన్ని టీటీడీ పక్కాగా అమలు చేయడం..  లడ్డూ తయారు చేసే పద్ధతుల్లో శాస్త్రీయత వల్ల తిరుమల లడ్డూ రుచి నేటికీ ఏమాత్రం తగ్గడంలేదు. మరోవైపు లడ్డూకు కావాల్సిన 16వేల టన్నుల ముడి సరుకుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా రూ. 250 కోట్లు ఖర్చు చేస్తోంది. 

Read Also: ఫోన్ లో స్పేస్ రన్నింగ్ ఔట్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి?


  






Post a Comment

Previous Post Next Post