ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?
![]() |
Image Credit: Pixel |
శారీరక, మానసిక ఆరోగ్యం చక్కగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పోషక విలువలు సమపాళ్లలో ఉండాలి. అప్పుడే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది. ఐతే ఆహార పదార్థాలను శుద్ధి చేసేటప్పుడు వాటి నుంచి కొన్ని పోషకాలు బయటకు వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ఆయా ఆహార పదార్థాలు తీసుకున్నా.. శరీరానికి పూర్తిగా పోషకాలు అందడం లేదు. దీన్ని భర్తీ చేసేందుకు తీసుకొచ్చిన ప్రక్రియే ఆహార పదార్థాల ఫోర్టిఫికేషన్. అసలు ఈ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ఫోర్టిఫైడ్ రైస్ ఎలా తయారు చేస్తారు? దానితో పోషకాహార లోపం భర్తీ అవుతుందా? ఫోర్టిఫైడ్ రైస్ సాధారణంగా వండుకోవచ్చా? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలు, మహిళలు, వృద్ధుల్లో పోషకాహార లోపాన్ని సరి చేసేందుకు ఆహార పదార్థాల్లో మైక్రోన్యూట్రియెంట్స్ ను భర్తీ చేయడమే ఫోర్టిఫికేషన్. అంటే.. ఏ ఆహార పదార్థంలోనైనా లోపించిన పోషకాలను ఫోర్టిఫికేషన్ పద్ధతి ద్వారా తిరిగి భర్తీ చేస్తారన్నమాట. ఫలితంగా ఆయా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మనకు పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. బియ్యం, గోధుమలు, నూనెలు.. ఇతరత్రా ఆహార పదార్థాలన్నింటినీ ఫోర్టిఫికేషన్ చేయవచ్చు. ఐతే దేశంలో ఎక్కువ మంది ప్రధాన ఆహారంగా తీసుకునే బియ్యాన్ని ఎలా ఫోర్టిఫికేషన్ చేస్తారో తెలుసుకుందాం.
నిజానికి గతంలో కూడా బియ్యానికి మైక్రో న్యూట్రీయెంట్స్ జత చేసే ప్రక్రియ అందుబాటులో ఉండేది. ముఖ్యంగా కోటింగ్ ద్వారా ఈ ప్రక్రియ చేసేవారు. కానీ ఎక్స్ ట్రూడర్ అనే సరికొత్త సాంకేతిక ఫోర్టిఫికేషన్ కు అనుకూలమని నిరూపితమైంది. దీని ద్వారా ముందుగా ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ (FRK) తయారు చేస్తారు. వాటిని సాధారణ బియ్యంతో కలపడం ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి అవుతుంది.
Video:అమెరికాలో ఘనంగా యోాగా దినోత్సవం
ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ ఎలా తయారు చేస్తారు?
బియ్యం పిండి తీసుకుని దానిలో మైక్రో న్యూట్రియెంట్స్, నీరు కలుపుతారు. అలా కలిపిన మిక్సర్ ను ఎక్స్ ట్రూడర్ యంత్రంలోని హీటింగ్ జోన్ గుండా పంపిస్తారు. అలా వెళ్లిన పిండి మిశ్రమం బియ్యం రూపాన్ని పోలి ఉండే గింజల పరిమాణంలో బయటకు వస్తుంది. వీటినే కెర్నెల్స్ అని వ్యవహరిస్తారు. వీటిని తిరిగి చల్లార్చి, ఎండబెట్టి ప్యాకేజింగ్ కు సిద్దం చేస్తారు. ఇలా ఉత్పత్తి అయిన కెర్నెల్స్ జీవిత కాలం 12 నెలలపాటు ఉంటుంది. వీటిని సాధారణ బియ్యంలో కలపడం ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ తయారవుతుంది. ఐతే కిలో సాధారణ బియ్యానికి 10 గ్రాములు మాత్రమే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్(FRK) కలపాలి. ఇలా కలిపిన ఫోర్టిఫైడ్ రైస్ లో కిలోకు 42.5 మిల్లీ గ్రాముల ఇనుముధాతు, 1250 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్, 1250 మైక్రోగ్రాముల వరకు విటమిన్ B-12 ఉంటాయి. సాధారణంగా ఈ పోషకాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంటాయి.. కాబట్టి వీటిని ఎక్కువగా ఫోర్టిఫికేషన్ చేస్తారు. ఇవే కాకుండా జింక్, విటమిన్ A, విటమిన్ B-1, విటమిన్ B-2, విటమిన్ B-3, విటమిన్ B-6 కూడా ఫోర్టిఫికేషన్ చేయవచ్చు.
ఫోర్టిఫైడ్ రైస్ ను సాధారణంగా వండుకోవచ్చా?
ఫోర్టిఫైడ్ రైస్ ను వండడానికి ప్రత్యేక పద్ధతులు ఏమీ లేవు. శుభ్రంగా బియ్యం కడిగిన తర్వాత సాధారణంగానే వండుకోవచ్చు. ఇలా వండుకోవడం ద్వారా దానిలో ఉండే పోషకాలు బయటకు వెళ్లిపోతాయనే భయం అవసరం లేదు.
Read Also: రోజూ బాదం తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
మరోవైపు ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ బహిరంగ మార్కెట్లో కూడా లభిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసిన తర్వాత.. సరైన నిష్పత్తిలో సాధారణ బియ్యానికి కలుపుకొని ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. ఐతే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ కొనుగోలు చేసేటప్పుడు లేబుల్ పై ‘+F’ అనే లోగో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే “Fortified with Iron, Folic Acid, and Vitamin B12” అనేది కూడా చెక్ చేసుకోవాలి.
Read Also: 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
Join us on Telegram Channel: 👉https://t.me/URnewstag
నోట్: ఈ స్టోరీ మీ స్నేహితులు, బంధువులకు ఉపయోగపడుతుందనుకుంటే కింద వాట్సప్ లింక్ ద్వారా షేర్ చేయండి.