16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం

                16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం


 పర్యావరణానికి పెనుభూతంగా పరిణమించిన ప్లాస్టిక్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించింది. ఇందులో ముఖ్యంగా 16 రకాలైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను కేంద్రం నోటిఫై చేసింది. నిషేధం విధించిన వాటిలో ఇయర్ బడ్స్ నుంచి బెలూన్ల వరకు ఉన్నాయి. పైగా ప్లాస్టిక్ ముడి పదార్థాలను సరఫరా చేయొద్దని పెట్రో కెమికల్ సంస్థలను కూడా ఆదేశించడం విశేషం. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్రం నిషేధించిన ప్లాస్టిక్ వస్తువుల జాబితాలో ఇయర్ బడ్స్, బెలూన్లు, క్యాండీ, ఐస్‌క్రీమ్ కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి. అలాగే  100 మైక్రాన్ల లోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే థర్మకోల్ వంటి 16 రకాల వస్తువులు ఉన్నాయి. 

Read Also: ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?

 అలాగే ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు ఎలాంటి ప్లాస్టిక్ ముడి సరకులను సరఫరా చేయవద్దని పెట్రో కెమికల్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. వాణిజ్య సంస్థలేవీ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించరాదంటూ స్థానిక సంస్థలు కూడా ఆదేశాలు జారీ చేయాలని.. వీటిని ఉల్లఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. 


తిరుమలలోనూ ప్లాస్టిక్ బ్యాన్

 మరోవైపు కలియుగ వైకుంఠం తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు టీటీడీ స్పష్టం చేసింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని ప్రకటించింది. ప్లాస్టిక్ కవర్లలో వచ్చే ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని భక్తులను, వ్యాపార సముదాయాలను, హోటళ్లను తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. అలాగే బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోడీగ్రేడబుల్ కవర్లు గాని పేపర్ కవర్లు గాని ఉపయోగించాలని తెలిపింది. ప్లాస్టిక్ షాంపూ పొట్లాలను తిరుమలలో విక్రయించడంపైనా నిషేధం విధించింది. హోటళ్ల నిర్వాహకులు, మఠాల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరింది. 



తిరుపతి జిల్లాకు 100 ఎలక్ట్రిక్ బస్సులు

 మరోవైపు తిరుపతి జిల్లా కూడా పర్యావరణ హితమైన నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి ఎలక్ట్రికల్ బస్సులు తిరుపతి జిల్లాల్లో రోడ్లపై పరుగులు తీయనున్నాయి. తొలి విడతలో భాగంగా జిల్లాకు 100 బస్సులో కేటాయించారు. ఇందులో తిరుమలకు 50 బస్సులు, తిరుపతి- మదనపల్లెకు 15 , తిరుపతి- కడపకు 15, తిరుపతి-నెల్లూరుకు 15,రేణిగుంట విమానాశ్రయానికి 5, బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. బస్సుల నిర్వహణ కాంట్రాక్టర్ ఛార్జింగ్ పాయింట్లు నిర్వహణ ఆర్టీసీ పర్యవేక్షించనుంది. 

See Also: Viral Video: విద్యార్థినిలతో ఢిల్లీ స్కూల్ టీచర్ డ్యాన్స్

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం

Post a Comment

Previous Post Next Post