సాయి పల్లవి వ్యాఖ్యలతో 'విరాట పర్వం' చిక్కుల్లో పడనుందా?

సాయి పల్లవి వ్యాఖ్యలతో 'విరాట పర్వం' చిక్కుల్లో పడనుందా?


 తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి కథానాయికగా పేరు తెచ్చుకున్న నటి సాయి పల్లవి చిక్కుల్లో పడింది. తాజాగా ఆమె నటించిన విరాట పర్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆమె వ్యాఖ్యలతో ఇప్పుడు సినిమా భవితవ్యంపై కూడా పడే సూచనలు కనిపిస్తున్నాయి. 

 దగ్గుబాటి రానా, హీరోయిన్ సాయి పల్లవి నటించిన తాజా సినిమా విరాట పర్వం. ఈ సినిమా విడుదల తేదీ జూన్ 17. ఐతే ఈ సినిమా విడుదల కాక ముందే తెలుగు రాష్ట్రాల్లో కాక రేగింది. ఇందుకు నటి సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కారణం. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె పలు మీడియా మాధ్యమాలతోపాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు కూడా ఇంటర్వూలు ఇచ్చారు. ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు మతం రంగు పులుముకున్నాయి. దీంతో ఒక వర్గానికి చెందిన ప్రేక్షకులు ఆమె సినిమా విరాట పర్వంను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు.. దీనికి సంబంధించి ట్విట్టర్ వేదికగా #Boycott Virata Parvam పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండింగ్ చేస్తున్నారు. దీంతో సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు సినిమా చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. 

సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలేంటి?

విరాట పర్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ సాయి పల్లవిని.. మీరు లెఫ్టిస్టా లేదా రైటిస్టా అంటూ ప్రశ్నించారు. ఐతే తాను తటస్థురాలినని చెప్పిన సాయి పల్లవి.. ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రస్తావించారు. కశ్మీర్ లో జరిగిన హింస గురించి చెప్పారు. అంతే కాకుండా ఒకవేళ ఎవరైనా ఆవులను తరలిస్తూ పట్టుబడితే వారిపై దాడులు చేస్తున్నారని.. అలాంటి ఘటనలను ఎలా చూస్తారని ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల హత్యలకు గోవులను తరలించే వారిపై జరిగే దాడులకు పెద్దగా తేడా లేదని వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల వారు సంయమనంగా ఉంటే మంచిదని సూచించారు. ఐతే ఈ వ్యాఖ్యల పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read Also: OTTలో సినిమానా.. ? ఆగండాగండి

 


Post a Comment

Previous Post Next Post