లేటుగానే OTTలోకి సినిమాలు..ఎందుకు?

         OTTలో సినిమానా...? ఆగండాగండి.. 


 కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్న వారందరికీ సినిమానే కాలక్షేపం. ముఖ్యంగా టీవీలు ఆ తర్వాత యూట్యూబ్.. వాటితోపాటు ఓటీటీ (OTT) కూడా తోడు కావడంతో వినోదాన్ని ఆస్వాదిస్తూ చాలా మంది ఇంట్లో నుంచి బయటకు రాకుండా తమను తాము కరోనా బారిన పడకుండా కాపాడుకున్నారు. ఐతే కరోనా తర్వాత కూడా సగటు ప్రేక్షకుడికి ఓటీటీతో అనుబంధం పెనవేసుకుపోయింది. అప్పట్లో సినిమా థియేటర్లు తెరచుకోక..  సినిమాలు రిలీజ్ చేయలేక ఇబ్బంది పడ్డ నిర్మాతలకు ఓటీటీ కారుచీకట్లో కాంతి పుంజంలా కనిపించింది. ఐతే ఇప్పుడు అదే ఓటీటీ సినీ నిర్మాతలకు పెద్దగా రుచించడం లేదు. కానీ ఓటీటీని కాదనలేని పరిస్థితి వారిది. 

  ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గిపోయింది. సినిమా హాల్స్ తెరుచుకున్నాయి. సినిమా విడుదల విషయంలో నిర్మాతల దృక్పథం కూడా మారిపోయింది. కరోనాతో దాదాపు రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమా నిర్మాతలు... ఎలాగైన సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు ఓటీటీని సాధనంగా ఎంచుకున్నారు. కొన్ని సినిమాలనైతే ఏకంగా ఓటీటీలోనే రిలీజ్ చేసిన పరిస్థితి గతంలో ఉండేది. దీంతో సగటు ప్రేక్షకుడు కూడా ఓటీటీకి బాగా కనెక్ట్ అయిపోయాడు. ఐతే ఇప్పుడు సినీ నిర్మాతలు తమ రూట్ మార్చారు. ఓటీటీలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అలాగని ఓటీటీని కాదనలేని పరిస్థితి. ఎందుకంటే వారికి అది కూడా ఓ కమర్షియల్ పాయింట్. గతంలో శాటిలైట్ రైట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కరోనా పుణ్యమా అని సినీ నిర్మాతలకు ఓటీటీ కూడా ఓ కమర్షియల్ పాయింట్ గా తయారైంది. ఐనప్పటికీ ప్రేక్షకులకు సినిమా థియేటర్లకు రప్పించాలని నిర్మాతలు తాపత్రయపడుతున్నారు. అందుకే వారి సినిమాలకు ఓటీటీలకు ఇచ్చేందుకు ఆలస్యం చేస్తున్నారు. 

 నిజానికి ఓటీటీ అనేది చిన్న సినిమాలకు బాగా పనికి వచ్చింది. అప్పట్లో కేవలం పెద్ద సినిమాలు, కమర్షియల్ సినిమాలకు మాత్రమే థియేటర్లు దొరికే పరిస్థితి ఉండేది. దీంతో చిన్న సినిమా నిర్మాతలు థియేటర్లు దొరకక ఇబ్బంది పడే వారు. కాబట్టి చిన్న సినిమా నిర్మాతలు ఓటీటీపై ఎక్కువగా ఆసక్తి చూపించారు. మరోవైపు కరోనా లాక్ డౌన్ కాలంలో ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్న ఓటీటీని థియేటర్ల యాజమాన్యాలు వ్యతిరేకించాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తమకు ఉపాధి కరువవుతుందనేది యాజమాన్యాల వాదన.  అంతే కాదు థియేటర్, డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ మీద ఆధారపడి జీవించే వారు ఆర్ధికంగా ఇబ్బందులపాలవుతారని స్పష్టం చేశాయి. 

Read Also:  ఓటీటీ (OTT)ని దూరం పెట్టాలి: అల్లు అరవింద్

  ఇక కరోనా తర్వాత చాలా వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. సినిమా ఇండస్ట్రీ దానికి అతీతం ఏం కాదు. ఐతే కరోనా తర్వాత తిరిగి థియేటర్లు తెరుచుకున్నా.. సగటు ప్రేక్షకులకు టికెట్ రేట్లు అందుబాటులో లేకుండా పోయాయి. దీనిపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. సినిమా కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాం.. కాబట్టి తిరిగి తీసుకోవడం తప్పేమీ కాదనేది సినీ పెద్దల వాదన. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. టికెట్ రేట్ల పెంపుతో తమకు గిట్టుబాటు అవుతుందని ఇటు నిర్మాతలు అటు థియేటర్ల యాజమాన్యాలు కూడా చెబుతున్నాయి. ఐతే ఇప్పుడు సగటు ప్రేక్షకుడు థియేటర్లకు రాకపోవడానికి ఈ టికెట్ రేట్లు కూడా ఓ కారణమవుతున్నాయి. ఇంటిల్లిపాది కలిసి సినిమా చూడాలంటే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోంది. కరోనా పేరుతో సినిమా టికెట్ రేట్లు పెంచడం సినీ ఇండస్ట్రీ వైపు నుంచి కరెక్టే అనిపించినా.. సగటు ప్రేక్షకుని దృక్కోణం నుంచి మాత్రం సరైంది కాదనిపిస్తుంది. ఎందుకంటే కరోనాతో ఆర్ధికంగా ఇబ్బంది పడ్డ వారిలో ఆ సగటు ప్రేక్షకుడు కూడా ఉన్నాడు. 

Read Also: F3 సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేది అప్పుడే

 కాబట్టి..  ఆ సగటు సినీ ప్రియులు ఇప్పుడు..  తమ వినోదం కోసం తక్కువ ఖర్చులో వచ్చే ఓటీటీకే ఓటు వేస్తున్నారు. ఫలితంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా తగ్గిపోతోంది. ఐతే నిర్మాతలు మాత్రం సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. టికెట్ రేట్ల తగ్గింపు విషయం పక్కకు పెడితే.. తమ సినిమాకు 'టికెట్ రేట్లు పెంచడం లేదు' అనే మాట నిర్మాతల నుంచి వినిపిస్తోంది. కానీ ఎవరి సినిమా రిలీజైనప్పుడు వారు మాత్రమే వ్యక్తిగతంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ తరఫున సమష్టిగా ఇలాంటి ప్రకటనలు రావడం లేదు. దీంతో పూర్తిగా కమర్షియల్ వాతావరణమే తప్ప.. సినిమా ఇండస్ట్రీ, కార్మికులు, థియేటర్ల యాజమాన్యాలు, థియేటర్ల ఆధారపడ్డ వారి జీవితాలపై పరిశ్రమ ఆలోచించడం లేదనే విషయం అర్థమవుతోంది. తెలుగు సినిమా జాతీయ స్థాయిలో ఎదుగుతున్న ఈ క్రమంలో సగటు ప్రేక్షకుడి ఆలోచనా ధోరణిని కూడా సినీ పరిశ్రమ పరిగణలోకి తీసుకుంటే తప్పేం లేదు కదా. 

Post a Comment

Previous Post Next Post