భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

        భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము


అందరూ ఊహించిందే జరిగింది. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(Droupadi murmu) ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారీటీతో ఆమె ఘన విజయం సాధించారు. దీంతో భారత తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి(President of India)గా ఆమె గుర్తింపు పొందారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై గెలుపొంది.. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి రౌండ్ నుంచి ఆమె ఆధిపత్యం కొనసాగింది. ముఖ్యంగా ఎంపీల ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ము ఘనమైన మెజారిటీ సొంత చేసుకున్నారు. మొత్తంగా 763 మంది ఎంపీలు ఓటు వేయగా..  వాటిలో 15 ఓట్లు చెల్లలేదు. ఐతే ఎంపీ ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ము 540 ఓట్లు సాధించారు. వాటి విలువ 3 లక్షల 78 వేలు. ఇక తర్వాత నిర్వహించిన ఎమ్మెల్యేల ఓట్ల కౌంటింగ్ లోనూ ద్రౌపది ముర్ము ఆధిపత్యమే కనిపించింది. 

ఒడిశాలో జన్మించిన ద్రౌపది ముర్ము(Draupadi murmu) తొలుత ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఆ తర్వాత క్రమంగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలో మంత్రిగానూ పని చేశారు. ఐతే బీజేపీ- బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా సేవలందించారు. మొత్తంగా ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలోని రాయ్ రంగ్ పూర్ నుంచి ఆమె ప్రయాణం రైసినా హిల్స్ వరకు సాగింది. 

 ఇక భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆమె నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ద్రౌపది ముర్ము స్వస్థలం రాయ్ రంగ్ పూర్ లో సంబరాలు అంబరాన్నంటాయి. అందరూ ఆమె విజయాన్ని ఉత్సవంలా జరుపుకున్నారు. ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. 

Post a Comment

Previous Post Next Post