పెరిగిన సిమెంటు ధర
కరోనా తర్వాత.. ఇప్పటికీ కోలుకోని నిర్మాణ రంగానికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఫలితంగా నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే స్టీలు ధరలతో సతమవుతుండగా.. తాజాగా సిమెంట్ ధరలు కూడా పెరిగాయి. దీంతో నిర్మాణ రంగంపై ధరాభారం తప్పడం లేదు.
దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు ధరలకు రెక్కలు వచ్చాయి. బస్తాకు 20 రూపాయల నుంచి 30 రూపాయలు పెంచుతూ సిమెంట్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంట్ బస్తాపై 20 రూపాయలు పెరగింది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బస్తా సిమెంట్ ధర రూ. 320 నుంచి రూ. 400 మధ్య కదలాడుతోంది. మరోవైపు పెరిగిన ధరలు ఈ నెల 2 నుంచే అమలులోకి వచ్చాయని సిమెంటు కంపెనీలు వెల్లడించాయి. ధరల పెంపు కోసం అంతకు ముందు మూడు రోజుల నుంచే సిమెంట్ బస్తాల పాత స్టాక్ ను విక్రయించాలని రిటైల్ వ్యాపారులకు సూచించినట్లు కంపెనీలు తెలిపాయి. కానీ క్షేత్రస్థాయిలో వేరేలా ఉంది. సిమెంట్ ధరలు పెరుగుతాయన్న అంచనాల మధ్య రిటైల్ వ్యాపారులు విక్రయాలను కట్టడి చేసినట్లు తెలుస్తోంది.
ఇండియా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, కేసీపీ, సాగర్ సిమెంట్స్, దాల్మియా భారత్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్, రామ్కో సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్ ధరలు పెంచిన కంపెనీల్లో ఉన్నాయి. మరోవైపు గత ఏప్రిల్ నెలలోనే సిమెంట్ ధరలు పెంచాలని కంపెనీలు భావించినప్పటికీ డీలర్ల వ్యతిరేకతతో వాయిదా పడింది. ఇప్పుడు ఇంధన వ్యయం సహా ఇతరత్రా వ్యయాల పెరుగుదలతో సిమెంట్ ధరల పెంపు తప్పలేదని కంపెనీలు చెప్పుకొస్తున్నాయి.