రాంగ్ పార్కింగ్ క్లిక్ కొట్టు.. రూ. 500 నజరానా పట్టు
దేశంలో కార్లు, ద్విచక్రవాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అలాగే పట్టణాల్లో భవనాల సంఖ్య కూడా లెక్కకు మించి పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఉన్న వాహనాల పార్కింగ్ కు పెద్ద సమస్య వచ్చి పడుతోంది. పైగా ఇల్లు నిర్మించుకునే వారు తమ సొంత వాహనాల పార్కింగ్ కోసం కనీసం స్థలం కేటాయించడం లేదు. దీంతో రోడ్లపై నిలిపి ఉంచే వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కాబట్టి.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త బంపర్ ఆఫర్ తో ముందుకు రానుంది.
రోడ్లు, ఇతర స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసే వాహనాలను ఫోటో తీసి పంపించిన వారికి రూ. 500 బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐతే ఇందుకోసం ఓ కొత్త చట్టాన్ని త్వరలోనే తీసుకొస్తామని వెల్లడించారు. రూల్స్ ను అతిక్రమించి పార్కింగ్ చేసిన వారి వాహనానికి నంబంర్ ఆధారంగా రూ. వెయ్యి వరకు జరిమానా విధిస్తారు. అందులో సగం మొత్తాన్ని అంటే రూ. 500ను ఎవరైతే వాహనం రాంగ్ పార్కింగ్ చేశారని ఫోటో పంపిస్తారో వారికి నజరానాగా అందిస్తారు. దీంతో రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ సమస్యకు కొంత మేరకు పరిష్కారం లభిస్తుందని నితిన్ గడ్కరీ అన్నారు.
రోడ్లపై వాహనాలు అస్తవ్యస్తంగా నిలిపి ఉంచడం వల్ల పట్టణాలు, నగరాల్లో విపరీతంగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. దీన్ని అరికట్టేందుకే కొత్త చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గతంలో ప్రజా రవాణాకు ఎక్కువ మంది మొగ్గు చూపేవారు. కానీ కరోనా తర్వాత దేశంలో చాలా మంది సొంతంగా కార్లు, ద్విచక్రవాహనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యతోపాటు పార్కింగ్ సమస్య కూడా పెరుగుతోంది.
Read Also: LPG కొత్త గ్యాస్ కనెక్షన్ ధర పెంపు
Read Also: కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏం తినాలి?