చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన యోగీ ఆదిత్యనాథ్
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఆదివారం ఉదయం భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనే స్వయంగా అమ్మవారికి హారతి ఇచ్చారు.
గతంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటానని యూపీ సీఎం మొక్కుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ రావడంతో ఆయన తన మొక్కు చెల్లించుకున్నారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి యోగీ ఆదిత్యనాథ్ తోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నారు. మరోవైపు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.