తిరుమలలో భారీగా భక్తుల రద్దీ
కలియుగ వైకుంఠం తిరుమలకు స్వామివారి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విపరీతంగా స్వామి వారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. స్వామి వారి దర్శనానికి 24 గంటల కంటే ఎక్కువగానే సమయం పడుతోంది.
ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని అన్ని క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన మండపం వరకు క్యూలైన్లలో వేచియున్నారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టీటీడీ (TTD ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉందని.. శ్రీవారి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని సూచించారు. కరోనా పరిస్థితులతో సుమారు రెండేళ్లుగా చాలా మంది భక్తులు తిరుమల రాలేకపోయారన్నారు. అందుకే ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉందని తెలిపారు. అలాగే భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తితిదే అధికారులు, ఉద్యోగులు బ్రహ్మాండంగా పనిచేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని అన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం కేంద్రమంత్రికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ 1987 నుంచి తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు. స్వామి దర్శనంతో కొత్త ఉత్సాహం, స్ఫూర్తి లభించాయన్నారు.