రాజ్యసభకు నాకు అర్హత లేదా?: నగ్మా
![]() |
Image Credit: Twitter |
రాజ్యసభ అభ్యర్థులు ఖరారైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముసలం షురూ అయింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటి పెట్టుకుని సేవ చేస్తున్నా అధిష్ఠానం పట్టించుకోవడం లేదని, కీలకమైన పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో లుకలుకలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన రాజ్యసభ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేత, నటి నగ్మా అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
నగ్మా చేసిన వరుస ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారికి అభినందనలు తెలుపుతూనే.. తనకు రాజ్యసభ టికెట్ కేటాయించకపోవడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు నగ్మా. పైగా మహారాష్ట్ర నుంచి ఎంపిక చేసిన ఇమ్రాన్ గర్హితో తన అర్హతను పోల్చుకున్నారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నా రాజ్యసభ టికెట్ కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తన తపస్సులో లోపం ఉందేమో అని ట్వీట్ చేశారు. 2003- 04లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామని సోనియాగాంధీ హమీ ఇచ్చినట్లు తెలిపారు. ఐతే 18 ఏళ్ల తర్వాత కూడా తనను పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తు చేస్తూ.. తనకు రాజ్యసభ అర్హత లేదా? అంటూ ప్రశ్నించారు.
Read Also: శశికళతో విజయ శాంతి భేటీ