Kodali Nani vallabhaneni vamsi appeared in Lokesh zoom meeting

 లోకేష్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని ప్రత్యక్షం


 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప్పు- నిప్పులా ఉండే టీడీపీ, వైసీపీ మధ్య ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఫెయిలైన విషయానికి సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. పలువురు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఎవరూ ఒత్తిడికి లోను కావొద్దని.. టీడీపీ తరఫున భరోసా ఇచ్చారు. ప్రభుత్వంతో తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. ఐతే ఈ సమావేశంలో ఆసక్తికరంగా వైసీపీకి సంబంధించిన నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. నారా లోకేష్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు.

 

  వల్లభనేని వంశీ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వైసీపీ అధినేత జగన్ కు జై కొట్టారు. ఈ మధ్యే తెలుగు దేశం మహానాడు తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వంశీ. తానెప్పుడూ తెలుగు దేశం పార్టీని విమర్శించలేదంటూ చెప్పారు. కానీ లోకేష్ విధానాలను మాత్రం ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చారు. అంతే కాదు తెలుగు దేశం పార్టీ చాలా గొప్ప పార్టీ అంటూ ప్రశంసించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా లోకేష్ మీటింగ్ లో వల్లభనేని కనిపించడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని కూడా నారా లోకేష్ జూమ్ మీటింగ్ కు హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. వారిపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు భరోసా కల్పించే ప్రయత్నం తాము చేస్తుంటే.. ఈ మీటింగ్ ను కూడా చెడగొట్టేందుకు ప్రయత్నిస్తారా అంటూ ఆగ్రహించారు. దీంతో వంశీ, కొడాలి నాని ఇద్దరూ మీటింగ్ నుంచి తప్పుకున్నారు. 

ఐతే వారిద్దరూ కావాలనే విద్యార్థుల పేరుతో మీటింగ్ కు హాజరయ్యేందుకు ప్రయత్నించారని టీడీపీ ఆరోపించింది. మీటింగ్ ను రసాభాసగా మార్చడం వారి వెనుక ఉద్దేశ్యం కావొచ్చని విమర్శించింది.

Follow us on: FaceBook  Google News


Post a Comment

Previous Post Next Post