ఢిల్లీలో ద్రౌపది ముర్మూ.. ప్రధాని మోదీతో భేటీ
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలో దిగిన ద్రౌపదీ ముర్మూ ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి దేశ రాజధానికి చేరుకున్న ఆమెకు దిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ ముఖ్య నేతలు ఆమెకు స్వాగతం పలికారు. శుక్రవారం(June 23) నాడు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఒడిశా భవన్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ద్రౌపదితో సమావేశమైనట్టు ప్రధాని స్వయంగా ట్విటర్లో వెల్లడించడం విశేషం. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెను ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాల వారూ ప్రశంసించారని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన, దేశ అభివృద్ధి పట్ల విజన్ గొప్పదంటూ కొనియాడారు. అనంతరం ద్రౌపది ముర్ము కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
Met Smt. Droupadi Murmu Ji. Her Presidential nomination has been appreciated across India by all sections of society. Her understanding of grassroots problems and vision for India’s development is outstanding. pic.twitter.com/4WB2LO6pu9
— Narendra Modi (@narendramodi) June 23, 2022
మరోవైపు ద్రౌపది నామినేషన్ పత్రాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ నివాసంలో సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ సంతకాలు చేసే వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, భాజపా సీనియర్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, ద్రౌపది అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన బిజూ జనతాదళ్ నుంచి సస్మిత్ పాత్రా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు జోషీ నివాసం వద్ద ఉన్నారు.
పలువురు అగ్రనేతల సమక్షంలో శుక్రవారం నాడు ద్రౌపదీ ముర్మూ తన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అందరి సహకారం కోరతానని ఆమె స్పష్టం చేశారు. ఓటర్లందరినీ (చట్టసభ్యులు) జులై 18లోపు కలిసి మద్దతు కోరనున్నట్టు ఆమె తెలిపారు.
Read Also: ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే ప్రమాదమా?