కీలక వడ్డీ రేట్ల పెంపు.. పెరగనున్న రుణభారం
అందరూ ఊహించిందే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. RBI కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. మూడు రోజుల పరపతి విధాన సమావేశాలు పూర్తయిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నిర్ణయాన్ని ప్రకటించారు. మే నెలలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ..తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపోరేటు 4.9 శాతానికి చేరింది. అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఐతే ఇదే విధంగా రెపో రేటు పెంచిన పక్షంలో ఈ ఏడాది చివరి నాటికి మొత్తంగా ఆర్బీఐ రెపోరేటు 5.6 శాతానికి చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.
పెరగనున్న ఈఎంఐలు
కీలక వడ్డీ రేట్లు పెరగడంతో.. దాని ప్రభావం రుణగ్రస్తులపై నేరుగా పడే అవకాశం ఉంది. ఆర్బీఐ తాజాగా సవరించిన రెపోరేటు ఆధారంగానే బ్యాంకులు,ఇతర ఆర్ధిక సంస్థలు వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో పెరగనున్న వడ్డీ రేట్లు బుుణగ్రస్తులకు మరింత భారమవుతాయి. ముఖ్యంగా గృహ రుణాలు తీసుకున్నవారికి ఇది చేటుగా పరిణమించే అవకాశం ఉంది. ఒకవేళ ఈఎంఐలలో మార్పు చేయకపోయినా.. రుణాలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరగవచ్చు.
కీలక రెపోరేటు పెంపునకు కారణాలేంటి?
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయాలు తీసుకుంటుంది. ఐతే ఈ ఏడాది ఏప్రిల్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరుకుంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, ముడి చమురు ధరలు ఇందుకు ప్రధాన కారణం. అలాగే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ కూడా ఈ ఏడాది ఏప్రిల్ లో 15.08 శాతానికి చేరింది. ఇవన్నీ కలగలిపి రెపో రేటు పెరగడానికి కారణాలయ్యాయని చెప్పవచ్చు.
Read Also: మొబైల్ లో స్పేస్ రన్నింగ్ ప్రాబ్లమ్ సరి చేయడం ఎలా
Follow us on: Facebook Google News