175 సీట్లు గెలవాల్సిందే: జగన్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల దిశగా వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే గడగడపకు ప్రభుత్వం పేరిట ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ వెళ్తూ ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలపై ఆరా తీస్తున్నారు. తాజాగా గడపగడపకు మన ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి మంత్రులతోపాటు రీజనల్ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, వైసీపీ జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. వర్క్ షాపులో వైసీపీ నేతలకు పలు అంశాలపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.
ముఖ్యంగా గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ పని తీరును ప్రజలకు వివరిస్తూ వైసీపీ ప్రజా ప్రతినిధులంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అంతే కాదు ఏకంగా 175 అసెంబ్లీ సీట్లలో గెలుపును టార్గెట్ గా నిర్ణయించారు. మొత్తంగా అన్ని సీట్లలో విజయం సాధించి ప్రతి పక్షమే లేని విధంగా వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. ప్రభుత్వ పని తీరును ప్రజలకు వివరిస్తే ఇది పెద్ద కష్టమేమీ కాదని చెబుతూనే.. కుప్పం మున్సిపాలిటీలో గెలుస్తామని ఊహించలేదన్నారు జగన్. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం నిబద్ధతగా పని చేస్తే .. లక్ష్యాన్ని సాధించడం సులువవుతుందని దిశా నిర్దేశం చేశారు.
గడపగడపకు మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంగా నిరంతరంగా మరో 8 నెలలపాటు కొనసాగుతుందని తెలిపారు జగన్. ప్రతి గ్రామ సచివాలయానికి రెండు రోజులపాటు సమయం కేటాయించాలని సూచించారు. నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అంతే కాదు ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్పై తదుపరి వర్క్షాపులో చర్చించాలని సూచించారు.
Read Also: మొబైల్ లో స్పేస్ రన్నింగ్ ప్రాబ్లమ్ సరి చేయడం ఎలా