తెలంగాణ ఆర్టీసీ మరో బాదుడు
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి బ్యాడ్ న్యూస్. మళ్లీ టికెట్ రేట్లు పెరిగాయి. ఈసారి డీజిల్ సెస్ పేరుతో TSRTC టికెట్ రేట్లు పెంచింది. దీంతో ఆర్టీసీ ప్రయాణీకులకు ధరాభారం తప్పడం లేదు. పల్లె వెలుగు బస్సుల నుంచి మొదలుకుని ఏసీ బస్సుల వరకు అన్ని సర్వీసుల్లో టికెట్ల రేట్ల పెంపును ఆర్టీసీ అమలు చేస్తోంది. కిలోమీటర్ ప్రాతిపదికన అదనపు వడ్డింపు ఉండనుంది. తాజా పెంపు జూన్ 9 గురువారం తొలి బస్సు నుంచి అమలులోకి వచ్చింది.
ఈ ఏడాది మార్చిలోనే డీజిల్ సెస్ పేరుతో ప్రతి ప్రయాణీకునిపై రూ. 2 నుంచి రూ. 5 వరకు భారం మోపిన టీఎస్ఆర్టీసీ.. తాజాగా కిలోమీటర్ వారీగా సెస్ వడ్డించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అలాగే మార్చిలోనే టోల్ ట్యాక్స్ వ్యత్యాసం, రూపాయికి ఛార్జీల సవరణ పేరుతో ప్రయాణీకుల దగ్గర గంపగుత్తగా దాదాపు రూ. 20 వరకు భారం మోపింది. తాజాగా పెంచిన టికెట్లు రేట్లు దానికి అదనంగా చెప్పవచ్చు. ఐతే ఇప్పుడు కిలోమీటర్ ప్రాతిపదికగా సెస్ విధించారు కాబట్టి.. తక్కువ దూరం ప్రయాణించే వారికి తక్కువగా.. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎక్కువగా ఛార్జీల మోత మోగనుంది. తాజాగా పెంచిన టికెట్ రేట్లు ఎలా ఉండనున్నాయో చూద్దాం.
తెలంగాణలో ఆర్టీసీ రోజు వారీగా బస్సులను నడపడానికి దాదాపు 6 లక్షల లీటర్ల డీజిల్ను వినియోగిస్తోంది. బల్క్ హెచ్.ఎస్.డి ఆయిల్ ధర 2021 డిసెంబర్ లో లీటరు రూ.84.75 ఉండగా 2022 మార్చి నాటికి రూ.118.73 పెరిగింది. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంస్థపై భారీగా పెరిగిన డీజిల్ ధర ఆర్థిక భారాన్ని మోపింది. తద్వారా ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు రూ.5 కోట్ల నష్టం వస్తోందని సంస్థ చెబుతోంది.
Read Also: మొబైల్ లో స్పేస్ రన్నింగ్ ప్రాబ్లమ్ సరి చేయడం ఎలా
మరోవైపు పల్లెవెలుగు సర్వీసుల విషయంలో తక్కువ దూర ప్రయాణీకులపై భారం పడకుండా ఉండేందుకు కనీస ఛార్జీ రూ.10 లో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణీకులపై తాజా టికెట్ రేటు పెంపును అమలు చేయడం లేదు. ఇక త్వరలోనే విద్యార్థులకు అందించే బస్ ఛార్జీలను కూడా పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఆర్టీసీ టికెట్ రేటు పెంపుపై మీ కామెంట్ తెలియజేయండి