వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి వారు పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్ని స్వామి, అమ్మవార్ల దీవెనలు అందుకున్నారు.
తెప్పోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి వారి ముఖ మండపంలో శ్రీ కృష్ణస్వామి వారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషాభిషేకం చేశారు.
ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ కృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తుల నీరాజనాలందుకొన్నారు.
ప్రతి ఏడాది అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండవ రోజు శ్రీ సుందరరాజస్వామి, మిగతా మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరిస్తారు. చివరి మూడు రోజులు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో అమ్మవారికి స్నపనతిరుమంజనం జరుగుతుంది.
ఇక జూన్ 13న రాత్రి 8 గంటలకు అమ్మవారికి గజవాహనం, 14న రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు. తెప్పోత్సవాల తర్వాత ప్రతిరోజూ ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. మరోవైపు తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు.
Read Also: కొత్త కార్మిక చట్టాల వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి?
అటు వేసవి సెలవుల తరువాత తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన జరుగుతోందని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
Follow us on: FaceBook Google News Twitter