విఘ్నేశ్, నయనతారపై టీటీడీ సీరియస్
విఘ్నేశ్, నయనతారపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. తిరుమల పవిత్రకు భంగం కలిగించారని వారిపై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. విఘ్నేశ్ శివన్, నయనతార ఇటీవలే మహాబలిపురంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారు. ఐతే మాడ వీధుల్లో తిరిగేటప్పుడు చెప్పులు వేసుకుని తిరిగారన్నది వారిపై వచ్చిన అభియోగం. ఇందులో విఘ్నేశ్ శివన్ చెప్పులు లేకుండా సంచరించినా.. నయనతార మాత్రం చెప్పులు వేసుకుని తిరిగింది. దీనిపై టీటీడీ (TTD) ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల పవిత్రకకు భంగం కలిగించేలా వారు వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు వారు ఇద్దరూ ప్రధాన ఆలయానికి సమీపంలోనే ఫోటో షూట్ లో పాల్గొన్నారు.
విఘ్నేశ్ శివన్ క్షమాపణ.. టీటీడీకి లేఖ
తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో.. ఈ ఘటనపై విఘ్నేశ్ శివన్ స్పందించారు. ఈ మేరకు టీటీడీకి లేఖ రాశారు. కాళ్లకు చెప్పులున్న విషయాన్ని అంగీకరిస్తూనే.. ఆ విషయాన్ని గమనించలేదని తెలిపారు. అంతే కాదు తమకు శ్రీవారిపై నమ్మకం, భక్తి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. నిజానికి వివాహం తిరుమలలోనే చేసుకోవాలని భావించామని.. కానీ అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అందుకే పెళ్లి జరిగిన వెంటనే స్వామి వారి కళ్యాణంలో పాల్గొనాలనే ఆలోచనతో తిరుమలకు వచ్చామని తెలిపారు. ఇక ఫోటో షూట్ విషయంలోనూ లేఖలో విఘ్నేశ్ వివరణ ఇచ్చారు. తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలనే ఉద్దేశ్యంతో ఫోటోలు తీసుకున్నట్లు వెల్లడించారు. దయచేసి క్షమించాలని విఘ్నేశ్ తన లేఖలో పేర్కొన్నారు.
Read Also: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
Follow us on: FaceBook Google News Twitter