కొత్త కార్మిక చట్టాల వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి?
భారత దేశంలో పని వేళలు మారబోతున్నాయా?
కార్మికుల PF కంట్రిబ్యూషన్ పెరగబోతోందా?
కొత్త కార్మిక చట్టాలు ఏం చెబుతున్నాయి?
కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న కేంద్రం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నాలుగు లేబర్ కోడ్ లను నోటిఫై చేసింది. వేతనాల కోడ్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, కార్మిక సంక్షేమం కోడ్ 2020, పని ప్రదేశాల్లో కార్మికుల భద్రత, ఆరోగ్యం కోడ్ 2020 ల పేరుతో 4 లేబర్ కోడ్ లను నోటిఫై చేసింది. ఇప్పటికే ఈ నాలుగు లేబర్ కోడ్స్ పార్లమెంట్లో ఆమోదం పొందాయి. అంతే కాదు దేశంలోని 23 రాష్ట్రాలు కూడా ఈ కొత్త లేబర్ కోడ్ ల ప్రకారం నిబంధనలు రూపొదించుకున్నాయి. ఈ కొత్త కార్మిక చట్టాలు జులై 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఐతే కొత్త కార్మిక చట్టాల ప్రకారం కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? పనివేళల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పనివేళల్లో మార్పు
కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే ఆఫీసు లేదా ఫ్యాక్టరీ పని వేళలు, వేతనాలు, ఉద్యోగుల భవిష్యనిధి(EPF), పింఛన్(pension) వంటి వాటిలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఫ్యాక్టరీస్ యాక్టు 1948 ప్రకారం ఉన్న 8 నుంచి 9 గంటల పని వేళలు ఏకంగా 12 గంటలకు పెంచుకునే అవకాశం ఉంది. ఫలితంగా వారానికి మూడు వీకాఫ్ లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కార్మికులు చేసే ఓవర్ టైమ్(OT) వారంలో 50 గంటల నుంచి 125 గంటలకు పెరుగుతుంది.
Read Also: మొబైల్ లో స్పేస్ రన్నింగ్ ప్రాబ్లమ్ సరి చేయడం ఎలా
కార్మికుల భవిష్యనిధిలో మార్పు
కార్మికుల భవిష్య నిధి మొత్తం పెరుగుతుంది. మొత్తం వేతనంలో 50 శాతం బేసిక్ శాలరీ ఉండాలని కొత్త కార్మిక చట్టాలు చెబుతున్నాయి. కాబట్టి కార్మికులు భవిష్య నిధికి జమచేసే మొత్తం పెరుగుతుంది. అలాగే అదే స్థాయిలో యజమాని జమ చేయాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. ఇది ఉద్యోగి లేదా కార్మికునికి సామాజిక భద్రత కలిగిస్తుంది. పని నుంచి విరమణ చేసిన తర్వాత కూడా నిశ్చింతగా జీవించే అవకాశం కల్పిస్తుంది. కానీ పని చేస్తున్న సమయంలో నెలనెలా ఇంటికి తీసుకువెళ్లే జీతంలో కొంత మేర కోత పడే అవకాశం ఉంది. ఇక పదవీ విరమణ తర్వాత వచ్చే మొత్తం, గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది.
180 రోజులకు తగ్గనున్న సెలవుల అర్హత
కార్మికులు ఏడాదికి 240 రోజులు పనిచేస్తే ఆర్జిత సెలవులు లభిస్తాయి. కానీ కొత్త కార్మిక చట్టాలు దానిని 180 రోజులకు తగ్గించాయి. దీంతో ఆర్జిత సెలవుల కోసం కొత్తగా పనిలో చేరిన కార్మికులు ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇక ప్రతి 20 రోజుల పని దినాలకు కార్మికులు తీసుకునే ఒక రోజు సెలవులో ఎలాంటి మార్పు లేదు.
మరోవైపు కరోనా విపరీతంగా వ్యాప్తి చెందిన సమయంలో చాలా మంది ఇంటి నుంచి విధులు నిర్వర్తించారు. ఈ వర్క్ ఫ్రం హోంకు గతంలో ఎలాంటి నిబంధనలు లేవు. ఇప్పుడు వర్క్ ఫ్రం హోం కు కూడా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం విశేషం.
Follow us on: FaceBook Google News Twitter