రణరంగంగా కోనసీమ
అమలాపురంలో చిచ్చురేగింది. కోనసీమ జిల్లా పేరు మార్పు... చిలికి చిలికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లా పేరు మార్చవద్దంటూ ఆందోళనకు దిగిన కోనసీమ సాధన సమితి నిరసన హింసాత్మకంగా మారింది. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఆందోళనకారులను చెదరగొట్టి కొంత మందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఐతే పోలీసులపై తిరగబడిన ఉద్యమకారులు.. రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏకంగా జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనాన్నే ఆందోళనకారులు టార్గెట్ చేశారు. ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్ కు గాయాలయ్యాయి. మరోవైపు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన డీఎస్పీ మాధవ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆ తర్వాత అమలాపురంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి.
ఉద్యమకారులు నేరుగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటినే టార్గెట్ చేశారు. ఆయన ఇంటికి వెళ్తున్న క్రమంలో మూడు ఆర్టీసీబస్సులను ధ్వంసం చేశారు. అనంతరం మంత్రి ఇంటికి కూడా నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
కోనసీమ జిల్లాకు ఇటీవలే భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఐతే దీనిపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కోనసీమ సాధన సమితి కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి చెలరేగింది.
అమలాపురంలో పరిస్థితిపై హోం శాఖ మంత్రి తానేటి వనిత ( Taneti Vanitha ) సమీక్షించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆమె విమర్శించారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే పోలీసులపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను అదేశించారు.
మరోవైపు అమలాపురం ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్నారు పవన్. అంబేద్కర్ పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికే సమస్యలు సృష్టిస్తున్నారని.. పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఎవరనేది రాష్ట్ర ప్రలజందరికీ తెలుసన్న ఆయన.. హోంమంత్రి చేసిన ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావనను ఖండించారు. ప్రభుత్వ లోపాలు, వైసీపీ వైఫల్యాలను జనసేనపై రుద్దడం మానుకోవాలని కోరారు.