అవినీతి మంత్రికి ఝలక్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.. సహచర మంత్రికే ఝలక్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింఘ్లాపై వేటు వేశారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి.. తమ ప్రభుత్వ పారదర్శకతను దేశానికి చాటి చెప్పారు. వైద్యఆరోగ్య శాఖలో టెండర్ల కోసం ఆ శాఖ మంత్రిగా ఉన్న విజయ్ సింఘ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆరా తీసిన సీఎం భగవంత్ సింగ్ మాన్.. కఠిన నిర్ణయం తీసుకున్నారు.
అంతే కాదు.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఒక్క శాతం అవినీతిని కూడా ఉపేక్షించదని స్పష్టం చేశారు. మరోవైపు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను సింఘ్లా కూడా ఒప్పుకున్నట్లు ముఖ్యమంత్రి మాన్ తెలిపారు. అంతే కాదు మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై తమ వద్ పూర్తి సమాచారం ఉందని.. వాటిపై విచారణ చేయిస్తామని సీఎం తెలిపారు. అటు సింఘ్లాపై కేసు కూడా నమోదు చేయాలని పంజాబ్ పోలీసులను మాన్ ఆదేశించారు. మంత్రి పదవి నుంచి తొలగించిన వెంటనే ఏసీబీ అధికారులు విజయ్ సింఘ్లాను అరెస్ట్ చేశారు.