నటి మీనా భర్త హఠాన్మరణం
తెలుగు, తమిళంలో ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగొందిన నటి మీనా ఇంట్రో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్ (48)హఠాత్తుగా కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలో నటి మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఐతే కరోనా నుంచి ఆ ఫ్యామిలీ కోలుకున్నప్పటికీ.. విద్యాసాగర్ మాత్రం కరోనా అనంతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఆయకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి చికిత్స తీసుకుంటున్నా.. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయి పరిస్థితి విషమించింది. మంగళవారం పరిస్థితి మరింత దిగజారడంతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.
బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్. ఆయనకు 2009లో మీనాతో వివాహం జరిగింది. వీరిద్దిరికి ఒక పాప కూడా ఉంది. ఆ చిన్నారి పేరు నైనిక. తమిళ హీరో తలపతి విజయ్ నటించిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది.
విషయం తెలిసిన సినీ ప్రముఖులు.. నటి మీనాకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.