తెలంగాణను తాకిన అగ్నిపథ్ ఆగ్రహ జ్వాల
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా మంటలు రగిలిస్తోంది. గురువారం బీహర్, హరియాణా, ఉత్తరప్రదేశ్ లలో జరిగిన హింస.. నేడు తెలంగాణను కూడా తాకింది. ముఖ్యంగా హైదరాబాద్ లో నిరసన జ్వాల రేకెత్తింది. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చిన ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు, విద్యార్థులు బస్సులపై రాళ్లు రువ్వారు. అటు సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి రణరంగంగా మారింది. పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు విసిరేసి నిరసన తెలిపారు. మొదటి మూడు ప్లాట్ ఫామ్ లలో విధ్వంసం సృష్టించారు. పోలీసులకు ఆందోళనకారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఆందోళనకారులపైకి దాదాపు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో పలువురికి గాాయాలయ్యాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైలుకు నిప్పు పెట్టడంతో ప్రయాణీకులంతా భయాందోళనకు గురయ్యారు. అంతా రైలు దిగి పరుగులు తీశారు. పోలీసులు రైల్వే స్టేషన్ చేరుకుని పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి వెళ్లాల్సిన రైళ్లన్నింటినీ దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వేకు ఈ ఆందోళన కారణంగా దాదాపు 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హైదరాబాద్ లో 44 MMTS రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు. అలాగే నాంపల్లి రైల్వే స్టేషన్ కు భద్రత పెంచారు. ప్రయాణీకులెవరూ నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు రావొద్దని రైల్వే అధికారులు సూచించారు. అలాగే హైదరాబాద్ కు రాావాల్సిన రైళ్లను వరంగల్, మహబూబాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్లలో నిలిపి ఉంచారు.
అగ్నిపథ్ను రద్దు చేసి గతంలో ఉన్న విధంగానే సైనిక ఎంపిక కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.