'అగ్నిపథ్'పై నిరసన జ్వాల ఎందుకు?

                'అగ్నిపథ్'పై నిరసన జ్వాల ఎందుకు?


  కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆగ్రహోదగ్రులైన విద్యార్థులు, ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. యూపీ, హరియాణా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో అసలు అగ్నిపథ పథకం అంటే ఏంటి? కేంద్రం ఏం చెబుతోంది? ప్రతిపక్షాలు, విద్యార్థుల డిమాండ్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

 అగ్నిపథ్ ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

 అగ్నిపథ్ లో చేరిన వారికి ఎంత వేతనం చెల్లిస్తారు?

 దేశ రక్షణ రంగంలోని త్రివిధ దళాల్లో చేరేందుకు అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద సైన్యంలో చేరాలనుకునే యువతకు అవకాశం కల్పిస్తారు. ఇలా చేర్చుకునే వారిని 'అగ్నివీర్'లుగా వ్యవహరిస్తారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య యువత దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నివీర్ లుగా అవకాశం లభిస్తుంది. వీరంతా మొత్తంగా నాలుగేళ్లు సైన్యంలో పని చేయాల్సి ఉంటుంది. ఐతే 6 నెలలు శిక్షణా కాలం, ఆ తర్వాత మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగుతారు. ఇక సర్వీసు చేసిన 4 ఏళ్లలో రూ.30వేల నుంచి రూ.40వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపినవారికి సేవాపతకాలు కూడా లభిస్తాయి. నాలుగేళ్ల సర్వీసు తర్వాత సైన్యం..  అగ్నివీర్‌లకు ఏకమొత్తంగా రూ. 11.71 లక్షల నిధి అందిస్తుంది. ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే  బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణసదుపాయం కూడా కల్పిస్తుంది. అంతే కాదు సర్వీసులో ఉన్నంత వరకు రూ.48లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది. 

అగ్నిపథ్‌.. అనేది యువత సైన్యంలో చేరేందుకు అవకాశాలను మరింత మెరుగుపరుస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ పథకం నాలుగేళ్ల కాంట్రాక్టుదే అయినప్పటికీ వారిలో ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన 25 శాతం మంది సర్వీసును కొనసాగిస్తారు. అంటే వారికి శాశ్వత కమిషన్ లో అవకాశం కల్పిస్తారన్నమాట. అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవాన్నీ అందిస్తారు. 

Read Also: తెలంగాణను తాకిన అగ్నిపథ్ నిరసన జ్వాల

మిగతా అగ్నివీర్‌ల పరిస్థితి ఏంటి? 

 అగ్నిపథ్‌లో నాలుగేళ్ల సర్వీసు అనంతరం 'అగ్నివీర్‌ స్కిల్‌ సర్టిఫికెట్‌'తో పాటు తదుపరి ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు చేస్తారు. వారికి సీఏపీఎఫ్(CAPF), రాష్ట్ర పోలీసుల నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఇతర రంగాలలో కూడా వారికి అనేక అవకాశాలను కేంద్రం కల్పిస్తుంది. స్వయం ఉపాధి కోసం కేంద్రం ఆర్థిక ప్యాకేజీ, బ్యాంకు రుణ పథకం అందజేస్తుంది. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి 12 తరగతికి సమానమైన సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది. మొత్తం మీద అగ్నివీర్‌ల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందనేది కేంద్రం వాదన.

విపక్షాలు, విద్యార్థుల వాదనేంటి?

 అగ్నిపథ్ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన పథకంపై ఆర్మీ ఉద్యోగార్థులు, విపక్షాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. కేవలం నాలుగేళ్ల ఉద్యోగం తమకు అవసరం లేదని సైనికోద్యోగ అభ్యర్థులు చెబుతున్నారు. పాత పద్ధతిలోనే సైనిక నియామకాలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ నిరుద్యోగులుగా మిగిలిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపథ్ పేరుతో పింఛను డబ్బులు ఆదా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వారు విమర్శిస్తున్నారు. ఒకవేళ పింఛను డబ్బులు ఆదా చేసుకోవాలనుకుంటే ప్రజా ప్రతినిధులకు ఇచ్చే పింఛను రద్దు చేయాలని కోరుతున్నారు. అటు అగ్నిపథ్ పథకంపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను కాపాడే సైన్యాన్ని కేంద్రంలోని మోదీ సర్కారు గౌరవించడం లేదని విమర్శించారు. అగ్నిపథ్ లో చేరిన యువతకు రెండేళ్ల వరకు ఎలాంటి ర్యాంకు ఇవ్వరని.. నాలుగేళ్ల తర్వాత పూర్తిగా ఉద్యోగ స్థిరత్వాన్ని కూడా కోల్పోతారని తెలిపారు. 

Read Also: క్రికెట్లో ఇలాంటి క్యాచ్ ఎప్పుడైనా చూశారా?

'అగ్నిపథ్' సరైనదేనా? మీ అభిప్రాయం తెలియజేయండి. ఇక్కడ👉 క్లిక్ చేయండి




Post a Comment

Previous Post Next Post