అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
మన్నెం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125 జయంత్యుత్సవాలు జరుగుతున్న వేళ ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి 30 అడుగుల విగ్రహం నేడు ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ.. అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరం బహిరంగ సభ వేదికగా చేసుకుని ఆయన వర్చువల్ గా అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విప్లవ వీరుడు అల్లూరిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు.
తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు దేశానికి స్ఫూర్తి అని కొనియాడారు.
అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అల్లూరి ఆదివాసీ పుత్రుల ధైర్యానికి ప్రతీకగా నిలిచారని చెప్పారు మోదీ. మోఘల్లులో ఉన్న ఆయన ధ్యాన మందిరం, చింతపల్లి పోలీస్ స్టేషన్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆనాడు అల్లూరి ప్రారంభించిన రంప ఆందోళనకు నేటితో నూరేళ్లు నిండాయని ప్రధాని గుర్తు చేశారు. మనదే రాజ్యం అంటూ ఆనాడు బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన భారతీయులను ఏకతాటి పైకి తీసుకొచ్చారని తెలిపారు.
అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. ఆయనకు స్వాగతం పలికారు.