APలో పొత్తులు కుదిరేనా? సీఎం అభ్యర్థిత్వంపై పీఠముడి వీడేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల తక్కెడ అటూ ఇటూ కదులుతూనే ఉంది. ముఖ్యంగా ప్రస్తుతమున్న YSRCP ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ(TDP ), బీజేపీ(BJP), జనసేన పొత్తు పెట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి క్లారిటీ రాలేదు. ఐతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పటికే పొత్తుకు సై అనే సంకేతాలు ఇచ్చారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలకుండా చూడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పొత్తులపై తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ నాయకులు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామంటూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఐతే అప్పటి నుంచి బీజేపీ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా క్షేత్రస్థాయిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇటు జనసైనికులు కూడా అదే రేంజ్ లో వాటిని తిప్పికొడుతున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల ఆంధ్ర ప్రదేశ్ పర్యటన నేపథ్యంలో రాజకీయ హీట్ మళ్లీ రాజుకుంది. ముఖ్యంగా రెండు రోజుల పర్యటనలో జనసేనతో బీజేపీ జట్టు కట్టడంపై క్లారిటీ వస్తుందని... అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకుంది. వీటిపై పవన్ స్పందించారు. క్షేత్రస్థాయిలో బీజేపీ, జనసేన మధ్య కాస్త గ్యాప్ పెరిగిన విషయాన్ని అంగీకరిస్తూనే.. అది కరోనాతో వచ్చిన సోషల్ డిస్టెన్స్ అంటూ సెటైరికల్ గా చెప్పారు. ఐతే బీజేపీ జాతీయ నాయకత్వంతో ఎలాంటి విభేదాలు లేవన్న పవన్.. త్వరలో అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపైనా పవన్ స్పందించారు. 2014, 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను తగ్గానని.. ఈసారి మిగతా పక్షాలు తగ్గితే బాగుంటుందని చెప్పారు. ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేనకు చెందిన వ్యక్తినే ప్రకటించాలని ఇరు పక్షాలకు పరోక్షంగా సూచించారు పవన్.
జనసేనతో పొత్తుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఓకే చెబుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ముఖ్యమంత్రి అభ్యర్థిపై చిక్కు తప్పదని కొందరు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఒకవేళ బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ను లేదా జనసేన పార్టీకి చెందిన వ్యక్తినో కూటమి తరఫున ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. టీడీపీ దీన్ని ఒప్పుకుంటుందా అనేది మరో ప్రశ్న. ముఖ్యంగా సీఎం అభ్యర్థిత్వంపై టీడీపీ ఫుల్ క్లారిటీతో ఉంది. మళ్లీ చంద్రబాబునే ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేస్తామని ఆ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడున్న జగన్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అది తమకు లాభం చేకూరుస్తుందనే అభిప్రాయం టీడీపీలో బలంగా ఉంది. ఈ క్రమంలో టీడీపీ ఒంటరిగా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగే అవకాశమూ లేకపోలేదు.