స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించుకోవడం ఎలా?
సెల్ ఫోన్(Cell Phone) లేదా స్మార్ట్ ఫోన్(Smart Phone).. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఒక్కొక్కరు రెండు మూడు ఫోన్లు(Mobiles) కూడా వాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో చాలా మంది రోజులో ఎక్కువ సేపు ఫోన్ లోనే జీవితం గడిపేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. సెల్ ఫోన్ వ్యసనంగా మారిందని అనుకోవచ్చు. కానీ ఈ అతిగా ఫోన్ వాడే అలవాటును మానుకోవచ్చు. దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచమే గుప్పిట్లోకి వచ్చేసింది. కాదు.. కాదు.. సెల్ ఫోన్ ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చేసింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అన్నీ పనులూ చకచకా జరిగిపోతున్న రోజులివి. పనులు చేసేందుకు కొన్ని యాప్స్ అయితే.. స్నేహితులు, బంధువులు, ఇతరులతో సంభాషించడానికి మరి కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ తోనే ఎక్కువసేపు జీవితాన్ని గడిపేస్తున్నారు. ఫలితంగా సోషల్ లైఫ్ అంటే సామాజిక జీవనానికి దూరంగా బతుకుతున్నారు.
నిత్యం సెల్ ఫోన్ ప్రపంచంలోనే గడపడం పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది. స్మార్ట్ ఫోన్ కారణంగా కంటి సమస్యలు, నిద్రలేమి, స్థూలకాయం(Obesity), మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి.. వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరి జీవితంలోకి చొచ్చుకు వచ్చిన మొబైల్ ఫోన్ ను పక్కకు పెట్టడం సాధ్యమా? ఇందుకోసం సరికొత్త జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే సాధ్యమేనని చెప్పవచ్చు.
ఫోన్ వాడకం తగ్గించాలంటే ఏం చేయాలి?
మొబైల్ ఫోన్లలో తమకు తెలియకుండానే చాలా మంది గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు. ఈ విషయం.. వారు వాడే మొబైల్ యాప్సే చెబుతాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తే మంచిది. దీని వల్ల అనారోగ్యాలను దూరంగా ఉంచేందుకు వీలుపడుతుంది. స్మార్ట్ ఫోన్.. వాడే వారు.. పలు రకాల యాప్స్ కు నోటిఫికేషన్స్ లేదా అలర్ట్ లు పెట్టుకుంటూ ఉంటారు. అవి రాగానే ఫోన్లు మోగుతాయి. లేదా స్క్రీన్ పై మెసేజ్ కనిపిస్తుంది. దీంతో తెలియని ఉత్సుకత కారణంగా వాటిని ఓపెన్ చేసి చూస్తారు. దీని వల్ల మరి కొద్ది సేపు మొబైల్ ప్రపంచంలోనే గడిపేస్తారు. కాబట్టి .. అలాంటి అలర్టులు లేదా నోటిఫికేషన్లను టర్న్ ఆఫ్ చేయాలి.
రాత్రి నిద్రపోయే వరకు మొబైల్ ఫోన్ చూస్తునే ఉండడం.. ఆ తర్వాత ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూడడం చాలా మంది చేసే పని. స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో దాదాపు 85 శాతం మంది ఇలాగే చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే చాలా మంది ఉదయం పూట అలారం కోసం స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు. అలారం రాగానే ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత అదే పనిగా మొబైల్ లో సోషల్ మీడియా మెసేజ్ లు చదువుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే అలారం కోసం ప్రత్యేకంగా గడియారాలు కొనుగోలు చేయడం మంచిది. దీని వల్ల ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూడడం తగ్గించుకోవచ్చు.
‘Do Not Disturb’ మంచి ఆప్షనా?
ఫోన్ మోగినా.. మెసేజ్ వచ్చినా చూసిన తర్వాత.. మళ్లీ సోషల్ మీడియా మెసేజ్ లు చెక్ చేయడం, మెయిల్స్ చూడడం చాలా మందికి ఉన్న అలవాటు. ఈ కారణంగా ఫోన్లలోనే ఎక్కువ సమయం గడిపేస్తూ ఉంటారు. కాబట్టి ఇందుకోసం ‘Do Not Disturb’ అనే సర్వీసును వాడుకోవచ్చు. రోజులో కొద్ది సమయం వరకు ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. అంటే ఆయా సమయాల్లో ఎలాంటి కాల్స్, మెసేజ్ లు చూడవద్దని స్వీయ నిర్ణయం తీసుకోవడం అన్నమాట.
మరోవైపు చాలా మంది మొబైల్ ఫోన్లలోనే గేమ్స్ ఆడుతున్నారు. దీని వల్ల ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే ఉండిపోతున్నారు. అలాంటి గేమ్స్ కు సంబంధించిన యాప్స్ తీసేయాలి. దీంతో ఫోన్ వాడకం కేవలం కాల్స్, మెసేజ్ లు, మెయిల్స్ వరకే పరిమితం అవుతుంది. ఫలితంగా గేమ్స్ తో అదనంగా ఉండే కాలం గణనీయంగా తగ్గుతుంది.
Read Also: పైనాపిల్ నుంచి లభించే పోషకాలు ఏవి?
ఎక్కువ కాలం మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండాలనుకునే వారు.. 3 రోజులపాటు స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఐతే మొబైల్ ఫోన్స్ వదిలేసి ఇతర ప్రాంతాలకు పర్యటనకు వెళ్తే మానసిక ఆనందం కలుగుతుందంటున్నారు. అలాగే ఆఫీసు ప్రదేశాల్లో ప్రత్యేకంగా మైబైల్ ఫ్రీ జోన్లకు క్రియేట్ చేసుకోవడం ద్వారా కూడా సత్ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా స్నేహితులు, తోటి ఉద్యోగులతో పార్టీలు ఏర్పాటు చేసుకోవడం కూడా మేలు చేస్తుంది.
పిల్లలపై స్మార్ట్ ఫోన్ ప్రభావం
స్మార్ట్ ఫోన్ వాడకం అనేది ఈ రోజుల్లో తప్పనిసరి. ఐతే అతి అయితే ఏదైనా చేదే అన్నట్లుగా స్మార్ట్ ఫోన్ వాడకం కూడా అంతే. కాబట్టి.. అది వ్యసనంలా మారేకంటే ముందుగానే దీన్ని వీలైనంత త్వరగా తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు ఈ తరంలో ఉన్న పిల్లలు పుట్టగానే స్మార్ట్ ఫోన్ తో ఆడుకోవడం మొదలు పెడుతున్నారు. వారికి దీన్ని వదిలించుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం. కాబట్టి పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్ అలవాటు చేయవద్దు. అలాగే 10 ఏళ్ల వయసు, ఆ పైబడిన పిల్లలకు దాని వాడకం గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.
Read Also: ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే చెవుడు వస్తుందా?
Join Telegram Channel: https://t.me/URnewstag
Follow on: Google News Twitter