తిరుమల పవిత్రోత్సవాల టికెట్లు విడుదల చేయనున్న TTD
కలియుగ వైకుంఠం తిరుమలలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమలలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆగస్టు 7న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమలలో ఏటా శ్రావణ మాసంలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం దశమి రోజున అంకురార్పణ నిర్వహించి ఏకాదశి నుంచి త్రయోదశి వరకు మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఏకాదశి రోజున పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ద్వాదశి రోజున ఉత్సవ మూర్తులకు పవిత్ర సమర్పణ, త్రయోదశి రోజున పూర్ణాహుతితో ఉత్సవం ముగుస్తుంది.
పవిత్రోత్సవం అంటే
తిరుమల ఆలయాన్ని భక్తులు సంవత్సరం పొడుగునా సందర్శిస్తారు. ఐతే యాత్రికుల వల్లగానీ, భక్తుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ ఆలయ పవిత్రకు భంగం కలగకుండా ఈ పవిత్రోత్సవాలను ఏటా నిర్వహిస్తారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఆలయ శుద్ధీకరణ ప్రక్రియ అన్నమాట. తిరుమల గర్భగుడితోపాటు ఆలయంలో సమస్త కోణాలను ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే పేరున సుగంధ ద్రవ్యాలతో జరిగే శుద్ధీకరణ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇది భౌతికమైనది. ఐతే పవిత్రోత్సవం అనేది భావనాత్మకమైనది. స్వామివారి కైంకర్యంలో మంత్రదోష, క్రియాదోష, కర్తవ్య లోపాలు ఉండవద్దనే ఉద్దేశ్యంతో దీన్ని నిర్వహిస్తారు. అంటే మానవుల దోషాలను పరిహరించుకోవడానికి ఏటా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారన్నమాట.
పవిత్రోత్సవాల నిర్వహణ ఇలా
తిరుమల పవిత్రోత్సవాల్లో భాగంగా మూడురోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి... ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 8 నాడే పవిత్రాల ప్రతిష్ట ఉంటుంది. మరుసటి రోజు ఆగస్టు 9న పవిత్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగస్టు 1న ఆన్ లైన్ లో టికెట్ల విడుదల
ఈ పవిత్రోత్సవాల్లో భక్తులు కూడా పాల్గొనవచ్చు. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది. మొత్తం 600 టికెట్లను ఆన్లైన్ ద్వారా జారీ చేస్తారు. భక్తులు రూ.2500 చెల్లించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు స్నపనతిరుమంజనంలో, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్దకు చేరుకోవాలని టీటీడీ సూచించింది. అలాగే టికెట్తోపాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకుని రావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.tirumala.org లేదా www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లను సందర్శించాలని సూచించింది.
Read: వృద్ధులకు ఉచితంగా శ్రీవారి దర్శన టికెట్లు
Read చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఎలా?
Join Telegram Channel: https://t.me/URnewstag
Follow on: Google News Twitter