మళ్లీ సునామీ వస్తుందా?
2011లో జపాన్ దేశాన్ని అతలాకుతలం చేసిన సునామీ గుర్తుందా? మళ్లీ అలాంటి సునామే వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. చిలీలో మత్య్సకారులు ఓ భారీ చేపను పట్టుకోవడమే దీనికి కారణం.
చిలీలో మత్య్సకారులు 16 అడుగుల భారీ చేపను సముద్రతీరంలో పట్టుకున్నారు. ఆ చేపను ఓర్ ఫిష్ అని వ్యవహరిస్తారు. ఇది ఒక రాకాసి చేప. ఐతే ఈ చేపను పట్టుకోవడంతో చిలీ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ రాకాసి చేప.. భారీ భూకంపం, సునామీ లాంటి వాటికి ముందస్తు సూచన అని చాలా మంది నమ్మడమే ఇందుకు ప్రధాన కారణం. 2011 జపాన్ తీరంలో భూకంపం, సునామీ రాకకు ముందు జపాన్ తీర ప్రాంతంలో ఈ చేపను చూసినట్లుగా చాలా మంది చెబుతున్నారు. దీంతో చిలీలోనూ భూకంపం లేదా సునామీ రావొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఓర్ ఫిష్ అనేది నీటి అడుగున భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు తీరానికి వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. నిజానికి ఓర్ ఫిష్ చేపలు నీటిలో 200 మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల లోతున సంచరిస్తుంటాయి. నీటి పైభాగానికి లేదా తీరానికి రావడం చాలా అరుదు. కాబట్టి ఓర్ ఫిష్ తీరం వైపు రావడం.. మత్య్సకారుల చేతికి చిక్కడాన్ని అశుభసూచకంగా భావిస్తున్నారు. ఐతే సోషల్ మీడియా ప్రచారాన్ని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. కానీ వంద శాతం అలాంటి అవకాశాలను తిరస్కరించలేమంటున్నారు.Regalecus glesne (Giant oarfish) caught off the cost of Arica, Chile. Apparently with a length of 5.80 m. https://t.co/hEGGhfnXxB
— Kornelius Kupczik (@KKupczik) July 12, 2022
2011లో ఫుకుషిమా భూకంపం ఆ తర్వాత సునామీ జపాన్ తీరంలో తీవ్ర విషాదం మిగిల్చింది. అప్పట్లో దాదాపు 20 వేల మందికి పైగా సునామీకి బలయ్యారు. ఆ సునామీకి ముందు జపాన్ తీర ప్రాంతంలో ఓర్ ఫిష్ కనిపించినట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఏం జరుగుతుందోననే భయాందోళన చిలీ ప్రజల్లో నెలకొంది.