సంకటహార చతుర్థి వ్రత విధానం
హిందువులు ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా మొదటగా విఘ్నేశ్వరున్ని పూజిస్తారు. అలాంటి గణనాథునికి అత్యంత ప్రీతపాత్రమైన తిథి చవితి. దీన్నే గణేష్ చుతుర్థి అని కూడా అంటారు. చతుర్థి నాడు గణపతిని పూజిస్తే అంతా శుభమే కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే చతుర్థి నాడు భక్తులు వ్రతం కూడా చేస్తారు. దాన్ని చతుర్థి వ్రతం అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి నాడు చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని.. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు చేసే వ్రతాన్ని సంకటహార చతుర్థి అని వ్యవహరిస్తారు. ఐతే వరద చతుర్థిని వినాయక చవితి రోజున గణపతి వ్రతంగా చేస్తారు. ఇక సంకటహార చతుర్థిని భక్తులు ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థినాడు చేసుకోవచ్చు.
సంకటహార వ్రతం ఎలా చేయాలి?
నియమాలు ఏంటి?
జీవితంలో కలిగే ఇబ్బందులను తొలగించుకోవడానికి సంకటహార చతుర్థి వ్రతం ఉపయోగపడుతుందనేది భక్తుల నమ్మకం. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్ట చతుర్థిగా పరిగణిస్తారు. ఆ రోజునే భక్తులు సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాల్సి ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలంటున్నారు. వ్రతం చేయాల్సిన రోజున ఉదయమే తలస్నానం చేసి ఆ తరువాత గణనాథున్ని పూజించాలి. తెలుపు లేదా ఎరుపు గుడ్డను గణనాథుని ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరించాలి. అందులో మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు పెట్టి మూటకట్టాలి. వ్రతాన్ని ఆచరించే వారు త్రికరణశుద్ధిగా సంకటనాశన గణేశ స్తోత్రంతోపాటు సంకట హర చతుర్థి వ్రత కథను చదవాలి. ఆ తర్వాత మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయలు, పండ్లు సమర్పించాలి.
Read Also: తిరుపతి లడ్డూ చరిత్రేంటో తెలుసా?
అనంతరం విఘ్నేశ్వరాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తి మేరకు వారు 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయవచ్చు. ఇక వ్రత పూజ అనంతరం విఘ్నేశ్వరున్ని కదిలించకుండా సూర్యాస్తమయం వరకు అలాగే ఉంచాలి. సూర్యాస్తమయం పూర్తైన తర్వాత మళ్లీ తల స్నానం చేసి దీపం వెలిగించి గణనాథున్ని పూజించాలి. ఆ తర్వాత గణపతికి కట్టిన మూటలోని బియ్యాన్ని పొంగలి చేసి స్వామివారికి నివేదించిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. దీంతో సంకష్టహార వ్రతం పూర్తవుతుంది.
Read Also: పైనాపిల్ నుంచి లభించే పోషకాలు ఏంటి?
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో ప్రతి నెల సంకటహార వ్రతం ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు ఆలయంలోని ఆస్థాన మండపంలో సంకటహార చతుర్థి వ్రతం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొంటారు.

