కడుపులో గ్యాస్ సమస్యకు కారణాలేంటి?

కడుపులో గ్యాస్ సమస్యకు కారణాలేంటి?


 కడుపు ఉబ్బరం.. ఈ సమస్య  సాధారణంగా అందరిలోనూ కనిపించేదే. ఇది జబ్బు ఏమీ కాదు. కేవలం ఒక శారీరక సమస్య మాత్రమే. ఐతే కడుపు ఉబ్బరం సమస్య రావడానికి  కారణాలేంటి? ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఈ సమస్య వస్తుంది? దీనికి నివారణ మార్గం ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

  కడుపు ఉబ్బరం.. అంటే కడుపులో అంతా పట్టేసినట్లుగా ఉండడం. కడుపులో గ్యాస్ ఎక్కువగా నిండిపోవడం వల్ల కడుపు ఉబ్బెత్తుగా, పట్టేసినట్లుగా అనిపిస్తుంది. ఒక్కసారి కడుపు నుంచి తేన్పు రూపంలో వాయువు బయటకు వెళ్లిపోతే ఉపశమనం కలుగుతుంది.  కడుపు ఉబ్బరం సమస్య అనేది ఆహారం ఎక్కువ తీసుకున్నా లేదా కొన్ని రకాల  ఆహారాలను పూర్తిగా నమిలి తినకున్నా, ఆహారం తినేటప్పుడు గబగబా తిన్నా, అధికంగా  పీచుపదార్థాలు ఉండే ఆహారం పరిమితికి మించి తీసుకున్నా వస్తుంది. 

కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడం ఎలా?

ఈ కడుపు ఉబ్బరం సమస్యను ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. దీని కోసం ఆహారపు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అంటే ఆహారపదార్థాల్లో  గ్యాస్ కలిగించే వాటిని తక్కువగా తీసుకోవాలి. కూరగాయల్లో బంగాళ దుంప, పుట్టగొడుగులు, బ్రకోలీ, కాలీఫ్లవర్, బఠానీ, మొలకల లాంటివి మోతాదు కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు కడుపులో గ్యాస్ చేరుతుంది. ఇవన్నీ శరీరానికి మంచి  పోషకాలను అందించే ఆహార పదార్థాలే పైగా పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. బంగాళదుంపల్లో పిండిపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులో గ్యాస్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగే బఠానీల్లో ఉండే చక్కెర పదార్థం గెలాక్టోఒలిగోశాచరైడ్స్ అనేది ప్రేగుల్లోని బ్యాక్టీరియా ఆకలి తీరుస్తుంది. దీని వల్ల కడుపులో గ్యాస్ తయారవుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే తగిన మోతాదుకు మించి తీసుకోకపోవడం మంచిది. 

 అలాగే తాజా పండ్లు శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయి. కానీ వీటిలోనూ కడుపులో గ్యాస్ ఉత్పత్తి చేసే పండ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆపిల్స్, బ్లాక్ బెర్రీ పండ్లు, పుచ్చకాయ, ఎండిన ఆప్రికాట్  పండ్లు కడుపులో గ్యాస్ తయారు చేస్తాయి. దీనికి కారణం.. ఈ పండ్లలో ఉండే సహజ సిద్ధమైన సార్బిటాల్ అనే చక్కెర పదార్థమే. జీర్ణక్రియ సక్రమంగా లేని వారు ఈ  పండ్లు తీసుకున్నప్పుడు.. కడుపులో అధికంగా వాయువు ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల  కడుపు ఉబ్బర సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి.. ఇలాంటి పండ్లు తీసుకున్నప్పుడు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అలాగే మంచి పీచుపదార్థం కలిగిన అల్పహారం కోసం చాలా  మంది  ఓట్ మీల్ ను ఉదయం పూట ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇది తింటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. కానీ ఎక్కువ పరిమితిలో ఓట్ మీల్ తినడం వల్ల  కడుపులో వాయువు ఉత్పత్తి అవుతుంది.  కాబట్టి దీన్ని కూడా పరిమితి మించి తీసుకోకుండా ఉండడం మంచిది.   

జంక్ ఫుడ్ వల్ల గ్యాస్ సమస్య పెరుగుతుందా?

 మరోవైపు చాలా మంది మార్కెట్లో దొరికే శీతల పానీయాలు, టీ, కాఫీలు అధికంగా తాగుతూ ఉంటారు.   దీని వల్ల కడుపు ఉబ్బరం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్కెట్లో దొరికే ప్యాక్డ్ ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, ఇతరత్రా చక్కెర కలిగిన పానీయాలకు దూరంగా ఉంటే మంచిది. మరోవైపు బబుల్ గమ్  లేదా చూయింగ్ గమ్ లాంటి వాటిని తీసుకున్నా కడుపులో గ్యాస్ చేరుతుంది.  వీటిని నమిలేటప్పుడు గాలి క్రమక్రమంగా కడుపులోకి వెళ్తుంది. ఇది వాయువుగా తయారై కడుపు ఉబ్బరంగా మారుతుంది. కాబట్టి చూయింగ్ గమ్ అలవాటును మానుకోవడం ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు. 

 తరచుగా మద్యం సేవించే వారిలోనూ కడుపు ఉబ్బరం సమస్య  అధికంగా ఉంటుంది. ఆల్కహాల్ లో ఉండే అధిక చక్కెరనే దీనికి కారణం. కాబట్టి ఆల్కహాల్ తీసుకునే వారు పరిమిత మోతాదులో తీసుకోవాలి. లేదంటే పూర్తిగా మానేసినా మంచి  ఫలితమే ఉంటుంది. జీవన విధానం, ఆహారపు  అలవాట్లలో మార్పుల ద్వారా కడుపు ఉబ్బరం సమస్యను ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. రోజూ తేలికపాటి వ్యాయమాలు చేయడం కూడా కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడడానికి ఉపకరిస్తుంది.

Follow us: Google News Twitter 

Post a Comment

Previous Post Next Post