రక్త ప్రసరణ మెరుగుపరిచే ఆహారాలు
మన శరీరంలో నిరంతరంగా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా రక్త ప్రసరణ జరిగితేనే అన్ని అవయవాలకు శక్తి అందుతుంది. అంటే రక్త ప్రసరణలో తేడా వస్తే అవయవాలకు శక్తి అందకుండా పోతుంది. ఫలితంగా ఆయా అవయవాలు పని చేసే అవకాశం ఉండదు. కాబట్టి శరీరంలో ఎప్పుడూ రక్త ప్రసరణ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు తీసుకోవడమే కాకుండా.. రక్త ప్రసరణను తగ్గించే అలవాట్లకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలోని అన్ని అవయవాలకు సరైన శక్తి అందినప్పుడే అవి సక్రమంగా పని చేస్తాయి. అన్ని అవయవాలకు శక్తి అందాలంటే.. మనం ఆహారం ద్వారా తీసుకున్న పోషకాలు శక్తిగా మారి .. అన్ని అవయవాలకు చేరుకోవాలి. ఇందులో కీలకపాత్ర పోషించేది మనలో ప్రవహించే రక్తం. ఇది అన్ని అవయవాలకు పోషకాలతో పాటు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. ఇందుకోసం గుండె, మెదడు నుంచి అన్ని అవయవాల వరకు రక్తం నిరంతరాయంగా ప్రవహిస్తుంది. ఆ నిరాటంక ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు రావడానికి వీళ్లేదు. అప్పుడే సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ రక్త ప్రసరణ తగ్గిపోతే అవయవాలకు పోషకాలు, ఆక్సిజన్ అందక సరిగ్గా పని చేసే అవకాశం లేదు. ఐతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండాలంటే చక్కని ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు వ్యాయమాలు, సరైన మోతాదులో నీరు తీసుకోవడం పరిష్కారమార్గం. అంతే కాకుండా పొగ తాగడం, మద్యం తీసుకోవడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది బీట్ రూట్. ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహంలో వేగం పెరిగేందుకు ఉపయోగపడుతుంది. అలాగే బీట్ రూట్ రసం తీసుకున్న వారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే నైట్రైట్ ఎక్కువగా ఉన్న ఆహారం పాలకూర. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త నాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ వేగం మెరుగుపడుతుంది. అంతే కాకుండా గుండె కవాటాలు సరిగ్గా పని చేస్తాయి. రక్తపోటు అదుపులో ఉండడానికి కూడా ఇది సహాయ పడుతుంది. మరోవైపు చేపలను మెనూలో చేర్చుకోవడం వల్ల కూడా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా సాల్మన్, మేక్రెల్, త్రౌట్, హెర్రింగ్, హ్యాలిబట్ లాంటి చేపల్లో ఓమేగా ఫ్యాటీ -3 ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె కవాటాల పని తీరును సక్రమంగా చేసి రక్త పోటు నియంత్రణలో ఉండేందుకు సహాయపడతాయి. కాబట్టి రక్త ప్రసరణలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉంటాయి.
రక్త ప్రసరణ మెరుగుపరిచే పండ్లు
రక్త నాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. తీసుకునే ఆహారంలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండాలి. బెర్రీ పండ్లు, దానిమ్మ, ద్రాక్ష, కమలా పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయా పండ్ల నుంచి లభించే ఆంథోసియానిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ రక్త నాళాలను విస్తరించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే వాపులను తగ్గించి రక్తం గడ్డకట్టకుండా నివారిస్తాయి. ఫలితంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా రక్తప్రసరణ జరుగుతుంది. అన్ని అవయవాలకు సరైన పోషకాలు, ఆక్సిజన్ లభిస్తాయి.
వెల్లుల్లితో రక్తప్రసరణ మెరుగవుతుందా?
రక్తప్రసరణ మెరుగుపడడానికి వెల్లుల్లి బాగా ఉపకరిస్తుంది. దీనిలోని సల్ఫర్ కాంపౌండ్ లో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తనాళాలు రిలాక్స్ గా ఉండడానికి సహయపడుతుంది. వెల్లుల్లి ఎక్కువగా తీసుకునే వారిలో రక్తం మరింత సమర్థవంతంగా ప్రవహిస్తుంది. కాబట్టి రక్త ప్రసరణ వేగాన్ని పెంచేందుకు గుండె ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంటే గుండెపై ఒత్తిడి పడకుండా ఉంటుందన్నమాట. వెల్లుల్లి ఎక్కువగా తీసుకునే వారిలో రక్త ప్రసరణ మెరుగుపడడమే కాకుండా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
Read Also: కడుపులో గ్యాస్ ట్రబుల్ కు కారణాలేంటి?
శరీరానికి యాంటీబయాటిక్ లా పని చేసే పసుపు కూడా రక్త ప్రసరణ మెరుగుపడడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని వాపులు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల శరీరంలోని రక్తనాళాలు విస్తరించి కండరాలకు సులభంగా రక్త ప్రవాహం జరిగేందుకు వీలుపడుతుంది.
రక్త ప్రసరణ మెరుగుపడడం కోసం ఆహారపు అలవాట్లలో ఈ మార్పులు చేసుకోవడంతోపాటు పొగతాగడం, మద్యం తాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. రోజూ తేలికపాటి వ్యాయామాలు చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. తగినంత నీరు శరీరానికి అందించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే రక్త ప్రసరణలో అవాంతరాలు లేకుండా చేసుకోవచ్చు.
Video: అందాల రష్మిక మందన్న ముచ్చట్లు
Follow On: Google News Twitter
Join Telegram Channel:https://t.me/URnewstag