ప్రజాదరణ కలిగిన పాలకుల్లో తెలుగు రాష్ట్రాల CMల ర్యాంక్ ఎంత?
తెలుగు రాష్ట్రాల CMలకు ప్రజాదరణ తగ్గిందా?
సెంటర్ ఫర్ నేషనల్ ఒపినియన్ సర్వే ఏం చెబుతోంది?
దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉంది అనే అంశంపై ప్రఖ్యాత సెంటర్ ఫర్ నేషనల్ ఒపినియన్ సర్వే(CNOS) అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఐతే ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కు టాప్ 10 జాబితాలో చోటు దక్కలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల అంశంపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ తాజా సర్వే ఫలితాలు ఒకింత వారిని, వారి పార్టీలను కలవరపెడుతున్నాయనే చెప్పవచ్చు.
తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలబెడతామని అవకాశం వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. ఇందుకోసం అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే తాజాగా సీఎన్ఓఎస్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆయనకు ఫలితాలు కాస్త ఫరవాలేదు అనే విధంగా వచ్చాయి. 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ర్యాంకులు కేటాయించగా.. కేసీఆర్ 11వ స్థానంలో నిలిచారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై 49 శాతం మంది ప్రజలు తమ సంతృప్తి వెల్లడించారు. అలాగే ఆయనపై 19 శాతం మంది అసంతృప్తిగా ఉన్నట్లు నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. అంతే కాదు మరో 24 శాతం మంది తటస్థంగా నిలిచారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సర్వే ఫలితాల్లో దాదాపుగా అట్టడుగు స్థానానికి పడిపోయారు. CNOS నిర్వహించిన సర్వేలో ఆయనకు 20వ ర్యాంకు దక్కింది. ఆయనపై 39శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో 32శాతం మంది తటస్థంగా ఉన్నారు. మొత్తంగా 10 పాయింట్లతో సీఎం జగన్ 20వ స్థానంలో నిలిచారు. ఇక జగన్ తర్వాతి స్థానాల్లో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఉన్నారు.
ఇక దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఆయనకు 70 శాతం ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 19 శాతం మందే అసంతృప్తి తెలిపారు. నవీన్ పట్నాయక్ తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానాన్ని, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మూడో స్థానాన్ని, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నాలుగో స్థానాన్ని కైవశం చేసుకున్నారు.
Read Also: పైనాపిల్ నుంచి లభించే పోషకాలు ఏంటి?
ఇక CNOS తాజా సర్వేలో ప్రధాని మోదీకి ప్రజాదరణ స్వల్పంగా పెరిగింది. గతంతో పోలిస్తే నికర ఆమోదం రేటింగ్ 36 పాయింట్లకు చేరింది. దేశంలో ఆయనపై 54 శాతం మంది పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. 18 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: దేశంలో కొత్త పార్టీ వస్తే తప్పేంటి?