వర్షాలు, వరదలపై కేటీఆర్ సమీక్ష

    వర్షాలు, వరదలపై కేటీఆర్ సమీక్ష 


 తెలంగాణను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రోజుల తరబడి కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పైగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది.  దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇక గోదావరి నది తీర ప్రాంతాలన్నీ భయం గుప్పిట్లో ఉన్నాయి. అలాగే చాలా చోట్ల రోడ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. 

 మరోవైపు మరో 3 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పునరావస, సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గోదావరి పరీవాహ ప్రాంతాల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. 

వరద సహాయ చర్యల్లో విషాదం

 మరోవైపు వరద సహాయ చర్యల్లో విషాదం నెలకొంది. కుమరం భీమ జిల్లా దహేగాంలో వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన రెస్క్యూ టీమ్ లో ఇద్దరు గల్లంతయ్యారు. వారిద్దరూ మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించారు. మృతులను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన రాము, సతీశ్‌గా గుర్తించారు. శ్రీరామ్‌పూర్‌ ఏరియా సింగరేణి రెస్క్యూ టీమ్‌లో పనిచేస్తున్న వీళ్లిద్దరూ.. వరద సహాయక చర్యల కోసం దహేగాం ప్రాంతానికి వచ్చారు. 

హెలికాప్టర్ తో ముగ్గురిని రక్షించిన రెస్క్యూ టీమ్ 

 మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి నది ఉద్ధృతంగా పొంగి పొర్లుతోంది. అక్కడ జేసీబీతోపాటు ముగ్గురు సిబ్బంది నదిలో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు రంగంలోకి దిగిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్.. మంత్రి కేటీఆర్ తో మాట్లాడి ఆర్మీ హెలికాప్టర్ తెప్పించారు. దీంతో నది మధ్యలో జేసీబీపై హాహాకారాలు చేస్తున్న ముగ్గురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. 


Read Also: 
తెలుగు రాష్ట్రాల CMలకు ప్రజాదరణ తగ్గిందా?

Read Also: పైనాపిల్ నుంచి లభించే పోషకాలు ఏంటి?

Post a Comment

Previous Post Next Post