డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్ లైన్ లావాదేవీలకు కొత్త రూల్స్
ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ- కామర్స్ రంగం ఊపందుకున్న తర్వాత నుంచి ఆన్ లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. అలాగే సేవా రంగంలోనూ ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. చాలా మంది వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డు నుంచి నేరుగా లావాదేవీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ- కామర్స్ సైట్లలో చాలా మంది తమ డెబిట్, క్రెడిట్ కార్డుల డేటాను స్టోర్ చేస్తున్నారు. ఐతే ఇది ప్రమాదమని గుర్తించిన ఆర్బీఐ(RBI).. దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది.
బ్యాంకు వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో కొత్త రూల్ తీసుకొచ్చింది. అదే టోకనైజేషన్. ఈ కొత్త నిబంధన 2022 జులై 1 నుంచి అమలులోకి రానుంది. అసలు టోకనైజేషన్ అంటే ఏంటి? బ్యాంకు ఖాతాదారులు ఏంచేయాలి? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో ఈ- కామర్స్ సైట్లు లేదా మర్చంట్ వెబ్ సైట్లు.. తమ వినియోగదారులు ఏదైనా వస్తువు కొనుగోలు చేసి ఆన్ లైన్ పేమెంట్ చేసే సమయంలో వారి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు డేటాను స్టోర్ చేసి పెట్టేవి. మళ్లీ తర్వాత ఎప్పుడైనా, ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తే.. ఇప్పటికే అందించిన డేటా ఆధారంగా చెల్లింపు జరిగే విధంగా ఏర్పాటు ఉండేది. కానీ ఇప్పుడు.. అంటే జూన్ 30 వరకు మాత్రమే గతంలో అందించిన క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు డేటా ఆయా మర్చంట్ సైట్లలో అందుబాటులో ఉంటుంది. జులై 1 నుంచి ఈ- కామర్స్ సైట్లు వినియోగదారులకు సంబంధించిన ఎలాంటి డేటాను స్టోర్ చేయడానికి వీలులేదు.
డెబిట్, క్రెడిట్ కార్డు టోకెనైజేషన్ అంటే ఏంటి?
ఆన్ లైన్ లావాదేవీలు చేసే వినియోగదారులు తమ డేటాను భద్రంగా ఉంచుకోవడానికి ఆర్బీఐ కొత్తగా టోకనైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని బ్యాంకులు లేదా కార్డ్ ప్రొవైడర్లు మాత్రమే చేసేందుకు అవకాశం కల్పించింది. మిగతా ఈ- కామర్స్ వెబ్ సైట్లు లేదా మర్చంట్ వెబ్ సైట్లు ఎలాంటి డేటా స్టోర్ చేసుకోలేవు. ఆన్ లైన్ లావాదేవీలు చేయాలనుకునే వారు తమ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వివరాలతో టోకనైజేషన్ కోసం కార్డు ప్రొవైడర్ లేదా బ్యాంకులకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అప్పుడు కార్డు ప్రొవైడర్ ఒక నెంబర్ కేటాయిస్తుంది. దాన్నే టోకెన్ అని వ్యవహరిస్తారు. ఈ టోకెన్ నంబర్ తో ఈ- కామర్స్ సైట్లలో ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఒకవేళ టోకెన్ నంబర్ క్రియేట్ చేసుకోనప్పటికీ ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కానీ షాపింగ్ సైట్లలో ప్రతీసారి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుకు సంబంధించిన డేటా పూర్తిగా అందించాల్సి ఉంటుంది.
నిజానికి ఈ టోకెనైజేషన్ రూల్ జనవరి 1 నుంచే అమలులోకి రావాల్సి ఉంది. కానీ ఆర్బీఐ ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది.
Read Also: కొత్త కార్మిక చట్టాల వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి?
Read Also: ప్రీడయాబేటిక్ స్టేజీ అంటే ఏంటి?